పరోక్షంగానే హెచ్చరిక

ABN , First Publish Date - 2022-11-13T03:20:30+05:30 IST

పరోక్షంగానే కానీ.. పదునైన మాటలతో హెచ్చరిక! వికృత ఆలోచనలు.. విపరీత చేష్టలు..

పరోక్షంగానే హెచ్చరిక

పదునైన పదాలతో ఘాటు వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోదీ మండిపాటు

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): పరోక్షంగానే కానీ.. పదునైన మాటలతో హెచ్చరిక! వికృత ఆలోచనలు.. విపరీత చేష్టలు.. రాజకీయ కుతంత్రాలతో అభాసుపాలు చేస్తున్నారని మండిపాటు! భయం, మూఢ నమ్మకాలతోనే రాద్ధాంతమంటూ ఎద్దేవా! అవినీతి, కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పిస్తామని సంకల్పం! ఈసారి ప్రధాని మోదీ కాస్త ఘాటుగానే స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాటల దాడి చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య అమీతుమీ అన్నట్లుగా పోరు సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ పేరు ప్రస్తావించకుండానే సునిశిత విమర్శలు చేశారు. మొయినాబాద్‌ ఫాంహౌజ్‌ కేసు రెండు పార్టీల మధ్య నిప్పు రాజేసిన నేపథ్యంలో పరోక్షంగానే విమర్శలు గుప్పించారు. వికృత ఆలోచనాపరుల విపరీత చేష్టలంటూ మండిపడ్డారు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని రాజకీయ కుతంత్రాలు, స్వార్థ రాజకీయాలతో అభాసుపాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

అవినీతి, కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తొలిసారిగా మోదీ తేల్చి చెప్పడం గమనార్హమని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రైతాంగానికి కేంద్రం చేస్తున్న సాయం, పథకాల అమలు, పేదల పట్ల టీఆర్‌ఎస్‌ వైఖరిని ఎండగట్టడం, కేడర్‌లో జోష్‌ నింపే దిశగా ప్రధాని రాష్ట్ర పర్యటన సాగిందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సింగరేణి ప్రైవేటుపరంపై కేసీఆర్‌ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారని, ఈ విస్పష్ట ప్రకటన సింగరేణి ఎన్నికల్లో తమకు సానుకూలం కాబోతోందని బీజేపీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కమలం వికసిస్తోందని, బీజేపీ పాలననే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలతో ఇప్పటి వరకు కొంత సందిగ్ధంగా ఉన్నవారు, తమ పార్టీలో చేరడానికి సిద్ధమవుతారని భావిస్తున్నట్లు మరో ముఖ్య నేత అన్నారు. ఇక, మోదీ పర్యటన బీజేపీ కార్యకర్తల్లో జోష్‌ నింపిందని తెలిపారు.

బండి సంజయ్‌కి ప్రధాని ప్రశంసలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రధాని మోదీ మూడు సందర్భాల్లో ప్రశంసించి భుజం తట్టారు. తన పర్యటన ఏర్పాట్లను ఘనంగా చేసినందుకు అభినందించారు. రామగుండం హెలిప్యాడ్‌ వద్ద స్వాగతం చెప్పేందుకు వచ్చిన సంజయ్‌ను దగ్గరకు తీసుకుని ‘సంజయ్‌ బండి జీ.. శెభాష్‌..’ అంటూ భుజం తట్టారు. బహిరంగ సభ వేదికపై ‘బండి జీ.. ఏర్పాట్లు చాలా బాగున్నాయి’’అంటూ అభినందించారు. బేగంపేటలో అడుగు పెట్టింది మొదలు రామగుండం ఎరువుల కర్మాగారం జాతికి అంకితం చేయడం, బహిరంగ సభ వరకు ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. తొలుత బేగంపేట స్వాగత సభలో ‘నేనొక కార్యకర్తను. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆదేశిస్తే మీ వద్దకు వచ్చాను’ అని చెప్పిన మోదీ.. ఆ సభలో ఉత్సాహంగా, ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

Updated Date - 2022-11-13T03:20:31+05:30 IST