సిట్ లేదా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి
ABN , First Publish Date - 2022-10-28T03:27:36+05:30 IST
మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ కేసును సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది.
మా ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే టీఆర్ఎస్ కుట్ర
‘ఎమ్మెల్యేల కొనుగోలు’తో బీజేపీకి సంబంధం లేదు
టీఆర్ఎస్ డైరెక్షన్లోనే మొత్తం వ్యవహారం
రాష్ట్ర పోలీసుల వల్ల పారదర్శక దర్యాప్తు జరగదు
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్ ఫామ్హౌ్సలో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ కేసును సీబీఐ దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. లేదంటే హైకోర్టు నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి గురువారం ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల్లో బీజేపీకి ఉన్న ప్రతిష్ఠను దెబ్బతీసి.. అప్రతిష్టపాలు చేసే కుట్రపూరిత ఉద్దేశంతో అధికార టీఆర్ఎస్ మొయినాబాద్ ఫామ్హౌ్సలో ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీసిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
‘‘మునుగోడు ఉపఎన్నికలో బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని టీఆర్ఎస్ పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలకు దిగింది. టీఆర్ఎ్సకు ప్రధాన పోటీదారుగా బీజేపీని తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు. మునుగోడులో ఓటమి భయంతో ఈ నెల 26న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తీశారు. ఇందుకోసం బీజేపీకి చెందిన కొంతమంది ప్రయత్నించారనే వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. సైబరాబాద్ కమిషనర్.. రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ ఇన్స్పెక్టర్ను వెంటబెట్టుకుని ఘటన జరిగిన ఫామ్హౌ్సకు వచ్చారు. వారికంటే ముందే మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నారు.
ముందస్తు వ్యూహంలో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వదిలేసిన పోలీసులు.. వారితో చర్చలు జరిపేందుకు వచ్చిన సింహయాజి, రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, నందకుమార్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. టీఆర్ఎ్సకు రాజీనామా చేసి బీజేపీలో చేరితే తమకు రూ.100 కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. టీఆర్ఎ్సలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్రెడ్డికి ఇలాంటి వ్యవహారాలు ఇష్టం లేకపోతే ప్రలోభాలకు గురిచేసే వ్యక్తులను చర్చల కోసం ఫామ్హౌ్సకు ఎందుకు ఆహ్వానించారు’’ అని పిటిషనర్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రోద్బలంతోనే ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తన పిటిషన్లో వివరించారు.
‘‘ఈ విషయాలు నిగ్గు తేలాలంటే సిట్ లేదా సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్జి లేదా స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించడం తప్పనిసరి. రాష్ట్ర పోలీసులు అధికార పార్టీ ఎజెండాలను అమలు చేస్తున్నారు. రాజ్యాంగంలోని 226 అధికరణ మేరకు హైకోర్టు తన అధికారాన్ని వినియోగించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చు. పోలీసులు అరెస్టు చేసిన వారికి.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు’’అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది.