వైభవంగా మూల నక్షత్ర విశేష పూజలు

ABN , First Publish Date - 2022-10-30T23:22:32+05:30 IST

వర్గల్‌ శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో విద్యా సరస్వతీ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్ర వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా మూల నక్షత్ర విశేష పూజలు

భక్తి పారవశ్యమైన శంభుగిరి కొండలు

వర్గల్‌, అక్టోబరు 30: వర్గల్‌ శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో విద్యా సరస్వతీ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్ర వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం వేడుకలకు అంకురార్పణ చేయగా సరస్వతీ అమ్మవారికి ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛరణలతో విశేష పంచామృతాభిషేకాలు, అలంకరణ నిర్వహించారు. పూజల సందర్భంగా ఆలయంలో లక్ష పుష్పార్చన, చండీహోమం, చండీ పారాయణం, పూజా కార్యక్రమాలు చేశారు. వేడుకలకు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. సరస్వతీ అమ్మవారి దర్శనంతో పాటు భక్తులు క్షేత్రంలోని ఉప ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ భోజన వసతిని కల్పించారు. వేడుకల సందర్భంగా విద్యాధరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శంభుగిరి కొండలు భక్తి పారవశ్యమయ్యాయి.

నాచగిరి క్షేత్రంలో వ్రత సిరి

వర్గల్‌ మండలం నాచారం నాచగిరి లక్ష్మీనృసింహాస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా క్షేత్రాన్ని భక్తులు వందల సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ పుష్కరిణి వద్ద కార్తీక పుణ్య స్నానాల కోసం బారులు తీరారు. ఆలయ మండపంలో నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధికంగా పాల్గొన్నారు. వ్రతాలు చేసుకున్న భక్తులు ఆలయంలోని నృసింహాస్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వామివారికి 12 అభిషేకాలు, 7 నిత్యకల్యాణం, 81 మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి దర్శనం కోసం నిర్వాహకులు బారికెడ్లను ఏర్పాటు చేశారు.

పలు ఆలయాల్లో కార్తీక ప్రత్యేక పూజలు

కొండపాక, అక్టోబరు 30 : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. మర్పడగ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం చివరి వరకు ప్రతీరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తారు. అలాగే సిరిసినగండ్ల పురాతన ఆలయమైన శివాలయంలో ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు. ప్రతీ రోజు సాయంత్రం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

నేడు విజయదుర్గా ఆలయ వార్షికోత్సవం

మర్పడగలోని విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో విజయదుర్గా ఆలయ వార్షికోత్సవం సోమవారం జరుగుతుందని క్షేత్ర నిర్వాహకులు డాక్టర్‌ చెప్పెల హరినాథశర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకు గణపతి పూజ స్వస్తివాచనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. పంచగవ్యప్రాశన గోపూజ అనంతరం అష్టోత్తర శత కలశస్థాపన, అష్టోత్తర శత కలశాభిషేకం, మూలమంత్ర హవనములు, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరన్నారు.

మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

చేర్యాల, అక్టోబరు 30: కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మట్టి కుండలో స్వామివారికి బెల్లం పాయసం నివేదించి పట్నాలు రచించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ఓడి బియ్యం, బండారి పట్టు వస్ర్తాలు సమర్పించి వేడుకున్నారు. గంగరేణి చెట్టుకు ముడుపులు కట్టి తమ కష్టాలు తీర్చమని వేడుకున్నారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి కల్లు, బెల్లం పానకం శాఖ పెట్టి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించి తమను కాపాడాలని తమ కష్టాలు తీర్చాలని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో బాలాజీ శర్మ, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు.

Updated Date - 2022-10-30T23:22:34+05:30 IST