కేసీఆర్ ‘దీక్షా దివస్’ చరిత్రాత్మక ఘట్టం
ABN , First Publish Date - 2022-11-29T00:39:09+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ చరిత్రాత్మక ఘట్టమని, దీక్షా దివస్ ఉద్యమ గతిని మలుపు తిప్పిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. హనుమకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయభాస్కర్ మాట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబరు 29 ఉద్యమ ఉధృతిని పెంచిందన్నారు.

బండి సంజయ్ది అహంకార యాత్ర
ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్
హనుమకొండ టౌన్, నవంబరు 28 : తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ చరిత్రాత్మక ఘట్టమని, దీక్షా దివస్ ఉద్యమ గతిని మలుపు తిప్పిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. హనుమకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయభాస్కర్ మాట్లాడారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో నవంబరు 29 ఉద్యమ ఉధృతిని పెంచిందన్నారు. రాష్ట్ర సాధన కోసం పలువురు బలిదానాలు చేసుకోవడంపట్ల కేసీఆర్ చలించి ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఆమరణ దీక్ష చేపట్టారని, నాటి సమైక్య పాలకులు దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసినప్పటికి 11 రోజుల పాటు దీక్ష చేశారని తెలిపారు. దీక్షా దివస్ పేరిట మంగళవారం నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వినయభాస్కర్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది అహంకార యాత్ర అని వినయభాస్కర్ ధ్వజమెత్తారు. సంజయ్కు దమ్ముంటే విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయించాలన్నారు. విలేకర్ల సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ‘కుడా’ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్, మాజీ ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, నేతలు జనార్ధన్గౌడ్, శ్రీనివాస్, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.
దీక్షా దివస్ కార్యక్రమాలు
నవంబరు 29న ఉదయం 10 గంటలకు కాళోజీ జంక్షన్లో దీక్షా దివస్ కార్యక్రమం.
30న సాయంత్రం 5 గంటలకు జయశంకర్ పార్కు నుంచి అమరవీరుల స్థూపం వరకు క్యాండిల్ ర్యాలీ.
డిసెంబరు 1న ఉదయం 10 గంటలకు వరంగల్ కార్పొరేషన్ స్ఫూర్తి చిహ్నం నుంచి అమరవీరుల స్థూపం వరకు బైక్ ర్యాలీ.
2న ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్లో ఫొటో ఎగ్జిబిషన్.
3న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అమరవీరుల సంస్మరణ సభ.. అదే రోజు 11 గంటలకు మైనార్టీల సంక్షేమంపై కార్యక్రమం.
4న సాయంత్రం 5 గంటలకు ఉద్యమకారులు, కవులు, కళాకారులకు కాజీపేటలో సత్కారం
5న ఉదయం 10 గంటలకు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం అభిరామ్ గార్డెన్స్లో..
6 ఉదయం 10 గంటలకు మున్సిపల్ గెస్ట్హౌజ్లో ‘అంబేద్కర్ ఆలోచన-కేసీఆర్ ఆచరణ’ పేరిట కార్యక్రమం
7న విద్యార్థి, యువజన ఉద్యమకారుల అలాయ్ బలాయ్ కార్యక్రమం.
8న ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో జెండావిష్కరణలు
9న దీక్షా దివస్ ముగింపు (పునరంకిత) సభ.