దీర్ఘకాలిక సెలవులో జడ్పీ సీఈఓ?

ABN , First Publish Date - 2023-04-29T00:30:50+05:30 IST

జిల్లా పరిషత సీఈఓ భాస్కర్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం జడ్పీ అధికారుల్లో శుక్రవారం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది.

దీర్ఘకాలిక సెలవులో జడ్పీ సీఈఓ?
జిల్లా పరిషత కార్యాలయం

సిమ్‌ ఇచ్చేసి వెళ్లిన జడ్పీ ఉన్నతాధికారి

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?

అనంతపురం విద్య, ఏప్రిల్‌ 28: జిల్లా పరిషత సీఈఓ భాస్కర్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం జడ్పీ అధికారుల్లో శుక్రవారం హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. సెలవుపై వెళ్లడంతో పాటు తన లెటర్‌హెడ్‌ను, సిమ్‌ను కూడా కార్యాలయంలో ఇచ్చేసి వెళ్లినట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు మూడేళ్లుగా ఆయన కొనసాగుతున్నారు. అయితే కొంత కాలంగా ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు అధికమైనట్లు సమాచారం. పాలకవర్గంలోని పెద్దల ఒత్తిళ్ల వల్లే ఆయన సెలవుపై వెళ్లినట్లు జడ్పీ కార్యాలయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. సెలవు ఎన్ని రోజులు తీసుకున్నారన్న సమాచారం కూడా బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తున్నారు. సెలవుపై వెళ్లిన ఆయన మళ్లీ రారన్న వాదనలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

చెప్పినట్లు తల ఊపలేకే వెళ్లారా..?

పాలక వర్గంలోని కొందరు పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి కొంత కాలంగా అధికారులపై ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. తాము చెప్పిన వారికి డెప్యుటేషన్లు వేయాలనడం, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఆదేశాలివ్వడం, పనుల్లో స్వేచ్ఛ ఇవ్వకపోవడంతో కొంతకాలంగా జడ్పీ ఉన్నతాధికార వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. రాజకీయ వేధింపులు ఎక్కువ కావడం వల్లే సీఈఓ సెలవుపై వెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఈఓ భాస్కర్‌రెడ్డి సెలవుపై వెళ్లడంతో డిప్యూటి సీఈఓగా పనిచేస్తున్న అమృతరాజ్‌కు ఇనచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు.

Updated Date - 2023-04-29T00:30:50+05:30 IST