AP Students: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల తరలింపుపై ప్రకటన విడుదల

ABN , First Publish Date - 2023-05-08T09:43:21+05:30 IST

మణిపూర్‌లో చిక్కుకున్న 157 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఏపీ భవన్ ప్రకటన విడుదల చేసింది.

AP Students: మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థుల తరలింపుపై ప్రకటన విడుదల

న్యూఢిల్లీ: మణిపూర్‌లో చిక్కుకున్న 157 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను (AP Students) తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఏపీ భవన్ ప్రకటన విడుదల చేసింది. పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి రెండు అదనపు విమానాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక విమానంలో హైదరాబాద్‌కు, మరో విమానంలో కోల్‌కతాకు తరలిస్తున్నట్లు ఏపీ భవన్ పేర్కొంది. హైదరాబాద్‌కు తరలించే వారిని వారి స్వస్థలాలకు చేరవేసేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (shamshabad Airport) ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోల్‌కతాకు చేరుకునే విద్యార్థులను కనెక్టింగ్ విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మణిపూర్ ప్రభుత్వ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరిపి వారిని తరలించేందుకు పూర్తిస్థాయి సహకారం ఇవ్వాలని కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా 160 మంది విద్యార్థుల వివరాలను సేకరించినట్లు తెలిపారు. 108 మంది విద్యార్థులు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. మిగిలిన వారిని కోల్‌కతా మీదుగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోల్‌కతాలో విద్యార్థులకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ భవన్ అధికారి రవి శంకర్‌‌ను నియమించింది.

మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు తెలంగాణ స్టూడెంట్స్..

మరోవైపు తెలంగాణ విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హైదరాబాద్‌కు (Hyderabad) చేరుకోనున్నారు. మణిపూర్ నుంచి మొత్తం 103 మంది విద్యార్థులను తరలించేందుకు తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాటు చేశారు. తొలి దఫాలో 75 మంది విద్యార్థులు నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ వెల్లడించించారు. మిగిలిన వారిని కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం తెలంగాణ భవన్‌కు చెందిన ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా కోల్‌కతాకు పంపినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కోల్‌కతా నుంచి హైదరాబాదుకు వెళ్లే విద్యార్థులు ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2023-05-08T09:53:34+05:30 IST