న్యాయం చేయండి సారూ..
ABN , First Publish Date - 2023-05-02T00:49:55+05:30 IST
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడే కారణంగా ఆశించిన మేరకు అర్జీదారులు కలెక్టరేట్కు రాలేదు.
చిత్తూరు, మే 1: చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడే కారణంగా ఆశించిన మేరకు అర్జీదారులు కలెక్టరేట్కు రాలేదు. బాధితుల నుంచి జేసీ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ మేఘ స్వరూప్, కిరణ్మయి, డీఆర్వో రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్రెడ్డి, ఇతర అఽధికారులు అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 132 మంది హాజరై సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఇందులో రెవెన్యూశాఖకు 95, హౌసింగ్కు 6, ఇరిగేషన్కు 1, ఐసీడీఎ్సకు 1, విద్యాశాఖకు 1, సోషల్ వెల్ఫేర్కు 2, పోలీ్సశాఖకు 1, ఫారెస్టుకు 1, నేషనల్ హైవేకు 1, పెన్షన్లు, రేషన్కార్డులకు 20 చొప్పున ఉన్నాయి. అధికారుల దృష్టికి వచ్చిన అర్జీల్లో కొన్ని..
ఆ కరెంటు తీగలు తొలగించండి
గాలివాన కారణంగా వ్యవసాయ భూమిలో పడిపోయిన కరెంటు తీగలు, ఇతర సామగ్రిని తొలగించాలని చిత్తూరు నగరం ఎల్బీపురం దళితవాడకు చెందిన లక్ష్మీపతి, నాగరాజు కోరారు. కరెంటు తీగలను తొలగించాలని పలుమార్లు చెప్పిన విద్యుత్శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో ఆవులను తోలుకెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. ఎక్కడా కరెంటు ప్రమాదంతో మూగజీవాలు చిక్కుకుంటాయో అనే భయంతో ఉన్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పడిపోయిన తీగలను తొలగించాలని కోరారు.
వారసులను కాదని వేరొకరికి పట్టాలు
పూర్వీకుల ఆస్తికి తాము వారసులుగా ఉండగా రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టాలిచ్చారని బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామస్థులు మొగిలిప్ప, చంద్రయ్య, చిన్నబ్బ, లక్ష్మమ్మ, కాంతమ్మలు ఫిర్యాదు చేశారు.గ్రామంలో రెండు సర్వే నెంబర్లలో 0.59 సెంట్లు, 2.23 ఎకరాల భూమి ఉందన్నారు.ఈ భూమిపై ప్రస్తుతం వేరొకరు పట్టా తీసుకున్నారని ఫిర్యాదు చే శారు. ఉన్నతాధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని కోరారు.
పోలీసు స్పందనకు 10 ఫిర్యాదులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 10 మంది అర్జీదారులు హాజరై తమ బాధలను సెబ్ ఏఎస్పీ శ్రీలక్ష్మీకి మొరపెట్టుకున్నారు. బాధితుల సమస్యలను విన్న ఆమె పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామి ఇచ్చారు. ఆస్తి తగాదాల కింద 5, కుటుంబ తగాదాల కింద 2, చీటింగ్, మిస్సింగ్, వేధింపుల కింద ఒక్కో అర్జీ వంతున అందాయి. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.