కొండను కొల్లగొట్టారు..

ABN , First Publish Date - 2023-04-19T00:46:21+05:30 IST

తాడేపల్లి మండలం ఉండవల్లి కొండ క్వారీ వద్ద అక్రమ మైనింగ్‌ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు నియోజకవర్గ, మండల, నేతలు, కార్యకర్తలు క్వారీ వద్దకు చేరుకుని బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కొండను కొల్లగొట్టారు..
క్వారీ వద్ద బైఠాయించిన టీడీపీ శ్రేణులు

తాడేపల్లి, ఏప్రిల్‌ 18: తాడేపల్లి మండలం ఉండవల్లి కొండ క్వారీ వద్ద అక్రమ మైనింగ్‌ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు నియోజకవర్గ, మండల, నేతలు, కార్యకర్తలు క్వారీ వద్దకు చేరుకుని బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఒక్కో లారీలో 30-40 టన్నుల మట్టిని వందలాది లారీల ద్వారా తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ మైనింగ్‌ మాఫియా తవ్వకాలు సాగిస్తుందని, టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానించారు. తరువాత టేపుతో అక్రమ తవ్వకాలను కొలిచి రెవెన్యూ అధికారులు కొండవద్దకు వచ్చి క్వారీకి సంబంధించిన అనుమతులు చూపించాలని, లేదంటే అక్కడ వున్న జేసీబీలు, లారీలు జప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ శ్రేణుల టెంట్‌ వద్దకు ఆర్‌ఐ రాగా క్వారికి సంబంధించిన వివరాలు అడగడంతో అవి తమ వద్ద లేవని మునిసిపల్‌ అధికారుల వద్ద ఉంటాయని బదులివ్వడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో సీఎం డౌన్‌ డౌన్‌ ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యమని ఆర్కే గ్రావెల్‌ స్కాం అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేయడంతో పోలీసులు టెంట్‌ వద్దకు వచ్చి ఆందోళన విరమించాలన్నారు. అయినప్పటికి టీడీపీ శ్రేణులు నినాదాలు చేయడంలో పోలీసులు అక్కడ బైఠాయించిన నేతలను అదుపులోకి తీసుకోబోయారు. టీడీపీ సీనియర్‌ నేత పోతినేని వద్దకు పోలీసులు రావడంతో కార్యకర్తలు ఒక్కసారిగా పోతినేనికి అండగా నిలబడ్డారు. అయినా పోలీసులు టీడీపీ శ్రేణులను అరెస్టు చేసేందుకు ఉపక్రమించడంతో పెనుగులాట చోటు చేసుకుంది. పలువురు టీడీపీ కార్యకర్తలు పడిపోయారు. పోలీసులు బలవంతంగా టీడీపీ నేతలను మహిళా నేతలను అదుపులోకి తీసుకుని రెండు వ్యానుల్లో దుగ్గిరాల, మంగళగిరి, పెదకాకాని పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళా నేతలను సైతం పోలీసు చర్యలను తీవ్రంగా ప్రతిఘటించారు. మహిళా పోలీసులు వచ్చి వారిని పక్కకు లాగేశారు. ఈ ఆందోళనలో భారీగా టీడీపీ శ్రేణులు మండుటెండను కూడా లెక్కచేయకుండా పాల్గొనడం విశేషం. ఉండవల్లి అక్రమ మైనింగ్‌ను 24 గంటల్లో నిలిపివేయకపోతే శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్‌ ప్రకటించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నియోజకవర్గ నేతలు నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాస్‌, అమరా సుబ్బారావు, దామర్ల రాజు, వల్లభనేని వెంకట్రావు, గూడూరు వెంకట్రావు, ఎం సత్యనారాయణ కాట్రగడ్డ మధు, తమ్మిశెట్టి జానకిదేవి, ఆకుల జయసత్య, అనూష, జంగాల సాంబశివరావు, బొర్రా కృష్ణవందన, దొప్పలపూడి జ్యోతిబసు, రియాజ్‌, మజీద్‌, జవ్వాది కిరణ్‌చంద్‌, బెజ్జం రామకృష్ణ, గోవాడ దుర్గారావు, కొల్లి శేషు, అన్నెం కుసుమ, కృష్ణవేణి, ఈపూరి కోటయ్య, సుబ్రహ్మణ్యం, రాజేష్‌, వేమూరి మైనర్‌బాబు, రాయపూడి కిరణ్‌, నరేష్‌, భాగ్యారావు, తమ్మా శంకర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-19T00:46:21+05:30 IST