ఉపాధ్యాయ వ్యతిరేక వైఖరితో ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-01-14T00:31:41+05:30 IST

ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేకవైఖరితో వ్యవహరిస్తుందని ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్‌ బీ సంపత్‌బాబు తెలిపారు.

ఉపాధ్యాయ వ్యతిరేక వైఖరితో ప్రభుత్వం
జిల్లా విధ్యాశాధికారి కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నఫ్యాప్టో నాయ కులు

సంఘాలతో చర్చించకుండా ఆదేశాలు జారీ

ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్‌ సంపత్‌బాబు

నరసరావుపేట టౌన్‌, జనవరి 13: ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేకవైఖరితో వ్యవహరిస్తుందని ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్‌ బీ సంపత్‌బాబు తెలిపారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. అనంతరం డీఈవో ఎం వెంకటప్పయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సమస్య వస్తే దానిని పరిష్కరించేందుకు పోరాడుతుంటే మరో సమస్యను తీసుకొచ్చి ప్రభుత్వం ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తుందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు వద్దని చెబుతున్నా విలీనం అనే ప్రక్రియ తెచ్చి దానికి భారీ స్థాయిలో ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతుల వస్తాయని భ్రమలు కల్పించారన్నారు. అదంతా అవాస్తమని, దానిలో పదోవంతు పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు. అర్హులైన ఎస్‌జీటీలకు గత అక్టోబరులో ఉద్యోగోన్నతులు ఇస్తామని చెప్పి వారి నుంచి అంగీకారం తీసుకుని ఈ రోజుకు కూడా ఎటువంటి ప్లేస్‌మెంట్‌, ఆర్డర్‌కాని ఇవ్వలేదన్నారు. ఇప్పుడు విచిత్రమైన పద్ధతిలో ప్రమోషన్లు తీసుకున్నవారికి ఎటువంటి ఇంక్రిమెంట్‌, నియామకం కాని లేకుండా అక్కడే ఉన్న పాఠశాలలో సర్దుబాటు చేసి దానికి ఒక అలవెన్సు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు. ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దుర్మార్గమైన విధానంతో వ్యవహరిస్తుందన్నారు. ఏ విషయంపై కూడా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా రాత్రికి రాత్రి ఆర్డర్స్‌ ఇవ్వడం, దానిని అమలు చేయడం సరికాదన్నారు. ఏ ప్రాతిపదిక అలవెన్స ఇస్తారని ప్రశ్నించారు. భవిష్యత్‌లో కూడా ప్రమోషన్లు లేకుండా కేవలం అలవెన్సు ఇచ్చే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అప్పుడు మాత్రమే ప్రభుత్వం కౌన్సెలింగ్‌, నిజమైన ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. లేకుంటే ఉపాధ్యాయ సంఘాలన్నీ ఉమ్మడిగా ఉద్యమిస్తాయని హెచ్చరించారు. ఫ్యాప్టో కో చైర్మన్‌ టీ చంద్రయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు పూర్తిగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిధంగా ఉన్నాయన్నారు. సమస్యలు సృష్టించకుండా ఉపాధ్యాయ పక్షాన ఉండి మానవీయ కోణంలో ఆలోచించాలని కోరారు. కార్యక్రమంలో కో చైర్మన్‌ ఎస్‌ఎం సుభాని, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎం శ్రీనివాసరావు, షేక్‌ జిలాని పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-14T00:31:49+05:30 IST