దివిసీమకు వంతుల వారీగా సాగునీరు
ABN , First Publish Date - 2023-08-16T00:59:25+05:30 IST
తీవ్ర సాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న దివి ప్రాంత రైతాంగానికి ఇరిగేషన్ శాఖ మంగళవారం చేదుకబురు అందించింది.
ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు
అవనిగడ్డ, ఆగస్టు 15 : తీవ్ర సాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న దివి ప్రాంత రైతాంగానికి ఇరిగేషన్ శాఖ మంగళవారం చేదుకబురు అందించింది. పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి కేఈబీ కెనాల్కు 1100 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నామని, దీంతో నాగాయలంక, కోడూరు సెక్షన్ల పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టుకు నీటిఎద్దడి తలెత్తుతున్నందున ఇకపై వంతులవారీ విధానంలో పంటకాలువలకు సాగునీరును విడుదల చేస్తామని ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు తెలిపారు. మంగళవారం పులిగడ్డ ఆక్విడెక్ట్ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ నుంచి అవనిగడ్డ ప్రధాన రెగ్యులరేటర్ ద్వారా నాగాయలంక సెక్షన్కు మూడున్నర రోజులు, కోడూరు సెక్షన్కు మూడున్నర రోజులు మాత్రమే వంతులవారీగా సాగునీటిని అందించనున్నామని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనికలోకి తీసుకుని తమ వంతు వచ్చినప్పుడు పంట పొలాలకు నీటిని సమృద్ధిగా నింపుకుని పొదుపుగా వినియోగించుకోవాలని ఈఈ సూచించారు. ఇరిగేషన్ డిఈ రవికిరణ్, డ్రెయినేజీ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈలు పాల్గొన్నారు.