కర్రలు కాదు.. బుర్రలు ఉపయోగించండి

ABN , First Publish Date - 2023-10-04T00:29:30+05:30 IST

బెజవాడ బార్‌లో సీనియర్‌ న్యాయవాదులు, పౌరహక్కులు, మానవహక్కుల సంఘం న్యాయవాదులైన పిచ్చుక శ్రీనివాస్‌, టి.ఆంజనేయులు ఇళ్లపై ఎన్‌ఐఏ అధికారులు సోదాల పేరుతో దాడులు చేసి వారి మొబైల్‌ ఫోన్లు, పుస్తకాలు తదితరాలను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే పోలీసులకు జ్ఞానం లేదనిపిస్తోందని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్లు సుంకర రాజేంద్రప్రసాద్‌, చలసాని అజయ్‌కుమార్‌లు మండిపడ్డారు.

కర్రలు కాదు.. బుర్రలు ఉపయోగించండి
నిరసన దీక్షలో ప్రసంగిస్తున్న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్లు సుంకరరాజేంద్రప్రసాద్‌, చలసాని అజయ్‌కుమార్‌ తదితరులు

విజయవాడ లీగల్‌, అక్టోబరు 3 : బెజవాడ బార్‌లో సీనియర్‌ న్యాయవాదులు, పౌరహక్కులు, మానవహక్కుల సంఘం న్యాయవాదులైన పిచ్చుక శ్రీనివాస్‌, టి.ఆంజనేయులు ఇళ్లపై ఎన్‌ఐఏ అధికారులు సోదాల పేరుతో దాడులు చేసి వారి మొబైల్‌ ఫోన్లు, పుస్తకాలు తదితరాలను స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే పోలీసులకు జ్ఞానం లేదనిపిస్తోందని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ మెంబర్లు సుంకర రాజేంద్రప్రసాద్‌, చలసాని అజయ్‌కుమార్‌లు మండిపడ్డారు. మంగళవారం సిటీ సివిల్‌ కోర్టుల ఆవరణలో బార్‌ న్యాయవాదులు, న్యాయవాదుల ఇళ్లపై ఎన్‌ఐఏ అధికారుల సోదాలను నిరసిస్తూ నల్ల బాడ్జీలు ధరించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సుంకర, చలసానితో పాటు బార్‌ అధ్యక్ష, కార్యదర్శులు కేబీ సుందర్‌, జన్ను శ్రీధర్‌, మాజీ బార్‌ అధ్యక్షులు చేకూరి శ్రీపతి, వి.గురునాథం, సీహెచ్‌.మన్మథరావు, కేవీవీ పరమేశ్వరరావు, కేవీఎ్‌సఎస్‌ సత్యనారాయణమూర్తి, బార్‌ మానహహక్కుల న్యాయవాది ఏఎ్‌సఎస్‌ రాంప్రసాద్‌, మాజీ పౌరహక్కుల సంఘం న్యాయవాది ఎస్‌ఎ్‌ససీ బోసు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్‌ఐఏ కేసుల్లో ముద్దాయిల తరపున వాదించడమే న్యాయవాదులు చేసిన నేరమా అని ముక్తకంఠంతో ప్రశ్నించారు. డిఫెన్స్‌ న్యాయవాదులను ఎన్‌ఐఏ వారు భయభ్రాంతులకు గురిచేయడం చూస్తుంటే వారికి అసలు జ్ఞానం లేదనిపిస్తోందని, పోలీసులు కర్రలు కాదు, బుర్రలు ఉపయోగించాలని మండిపడ్డారు. ఇలాంటి ఉడత ఊపులకు న్యాయవాదులు ఎవరూ బెదరరని, ఇది న్యాయవాద వృత్తిపై ఎన్‌ఐఏ అధికారుల దాడిగా వారు అభివర్ణించారు. బుధవారం బెజవాడ బార్‌ న్యాయవాదులు విధులను బహిష్కరించి, రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని, భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని పేర్కొన్నారు. దీక్షలో న్యాయవాదులు గంధం శ్రీను, వజ్జా రవి, చింతా ఉమామహేశ్వరరెడ్డి, కె.ఎ్‌స.సుధాకరరాజు, బోను జయమ్మ, ఆర్‌.గంగాభవానీ, పేడూరి సాయిబాబు, సంపర శ్రీను, బొమ్మసాని రవి, సప్పా రమేష్‌, దుర్గంరాజు బుచ్చిరాజు, వైవీ కిషోర్‌బాబు, పుప్పాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-04T00:29:30+05:30 IST