నందిగామ మున్సిపాలిటీలో ముసలం!
ABN , First Publish Date - 2023-02-01T00:33:11+05:30 IST
నందిగామ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ కంటతడి పట్టణంలో చర్చనీయాంశమైంది. చైర్పర్సన్ పీఠంపై ఉన్నది అధికార పార్టీకి చెందిన వ్యక్తే అయినా ఆమె కన్నీరు పెట్టడానికి కారణం మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పెత్తనం.. కీలకమైన అభివృద్ధి పనుల్లో నేతల జోక్యంపై కినుక.. కమిషనర్ తీరుపైనా ప్రజల్లో చర్చకు దారితీసింది.
నందిగామ : టీడీపీకి కంచుకోట అయిన నందిగామ మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో 20 స్థానాలకు 13 స్థానాలు వైసీపీ కైవశం చేసుకుంది. వీటితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శాసనసభ్యుడి బలం కూడా ఉంది. అనంతరం 11వ వార్డు నుంచి గెలుపొందిన మండవ వరలక్ష్మిని చైర్పర్సన్గా ఎంపిక చేశారు. ఆమె పదవి చేపట్టిన రెండు, మూడు నెలలకే ఆధిపత్య పోరు మొదలైంది. మునిసిపల్ సమావేశాలలో ఎమ్మెల్యే జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్కుమార్లు పెత్తనంతో పాటు పట్టణంలో జరిగే అభివృద్ధి పనుల్లో ఆయన జోక్యాన్ని చైర్పర్సన్ జీర్ణంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వారి మధ్య అంతరం ఏర్పడింది. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, ఎవరికి పనులు అప్పగించాలన్న అంశాలు మరింత దూరం పెంచాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అధికారులు, కౌన్సిలర్లు ఆయనకు అనుకూలంగా మారారు. నెలవారీ సమావేశాల అజెండాను చైర్పర్సన్ అనుమతి లేకుండానే రూపొందిస్తున్నారు. నిబంధనల ప్రకారం అజెండా అంశాలను చైర్పర్సన్ అనుమతితో సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఒక దశలో సమావేశాల నిర్వహణ నిలిపివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కౌన్సిలర్లు ఆమెను చైర్పర్సన్ పీఠం నుంచి తప్పించే ప్రయత్నాలు చేశారు. అవిశ్వాసం పెట్టాలంటే నాలుగేళ్లు పూర్తి కావాలన్న నిబంధనతో పాటు పలు సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ తరణంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించడం జరిగింది. నిధుల కేటాయింపులో చైర్పర్సన్ కలసిరాకపోవడంతో పలు కీలకమైన అభివృద్ధి పనులను అజెండాలో పెట్టకుండా, కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్వహించారు. అనంతరం రాటిఫికేషన్కు పెడుతూ వచ్చారు. దీంతో చైర్పర్సన్ ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తన అధికారాన్ని ఉపయోగించి అధికారులకు చుక్కలు చూపారు. వీధి దీపాలకు బిల్లుల చెల్లింపులు, జగనన్న కాలనీకి మట్టి తోలకం బిల్లులతో పాటు సీఎం రోడ్డు అభివృద్ధి పనుల బిల్లులను నిలిపివేశారు. ఈ విషయంలో చైర్పర్సన్కు కొందరు వైసీపీ కౌన్సిలర్లు తెరవెనుక మద్దతు తెలిపినట్టు తెలిసింది. పట్టణంలో అభివృద్ధి పనుల కాంట్రాక్ట్లు కొందరికే దక్కుతుండడం పట్ల వారంతా అసంతృప్తితో ఉన్నారు.
తాజాగా సోమవారం జరిగిన సమావేశంలో చైర్పర్సన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తూ కమిషనర్పై ఆమె నిప్పులు చెరిగారు. అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు కూడా కమిషనర్ తమను లెక్క చేయడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికల సమయంలో లక్షలు వెచ్చించామని, తమ వార్డుల్లో సైతం కొందరు గుత్తేదారులు అభివృద్ధి పనులు చేస్తూ లబ్ది పొందుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికార వైసీపీకి మునిసిపాలిటీని అప్పగిస్తే ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ఆశించిన పట్టణ ప్రజలు ప్రస్తుత పరిణామాలపై పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా మునిసిపల్ పాలకవర్గం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించి కీచులాటలు మాని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నారు.