Pattabhi: పట్టాభి కస్టడీ పిటిషన్‌ వెనక్కి

ABN , First Publish Date - 2023-02-24T20:36:00+05:30 IST

గన్నవరంలో ఘర్షణల్లో అరెస్టయిన కొమ్మారెడ్డి పట్టాభి (Kommareddy Pattabhi) కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. పట్టాభిని రెండు రోజులపాటు కస్టడీ..

Pattabhi: పట్టాభి కస్టడీ పిటిషన్‌ వెనక్కి

విజయవాడ: గన్నవరంలో ఘర్షణల్లో అరెస్టయిన కొమ్మారెడ్డి పట్టాభి (Kommareddy Pattabhi) కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. పట్టాభిని రెండు రోజులపాటు కస్టడీ (Custody)కి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు పిటిషన్‌ను దాఖలు చేశారు. అసలు పట్టాభి గన్నవరం ఎందుకు వచ్చి ప్రేరేపిత వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవడానికి విచారణకు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి శిరీష రిటర్న్‌ చేశారు. కేసు విజయవాడలోని ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు పరిధిలోకి వస్తుందని, తన పరిధిలోకి రాదని వ్యాఖ్యానించి పిటిషన్‌ను శుక్రవారం రిటర్న్‌ చేశారు. మరోపక్క పట్టాభిని విడుదల చేయాలని దాఖలైన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి.

సీఐ కనకారావుతోపాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితోసహా పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోసహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 341, 333, 307 కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పట్టాభితోపాటు నిందితులంతా రాజమండ్రి (Rajahmundry) కేంద్ర కారాగారంలో ఉన్నారు. గన్నవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి నమోదు చేసిన మూడు కేసుల్లో 13 మందిని పోలీసులు నిందితులుగా చూపించారు. వారిలో పట్టాభితోపాటు పది మందిని గన్నవరంలోని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-02-24T20:36:01+05:30 IST