Kommalapati Sreedhar: ఇంటికి చేరుకున్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఊపిరిపీల్చుకున్న టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2023-04-09T18:35:45+05:30 IST

టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ (Kommalapati Sreedhar) ఇంటికి చేరుకున్నారు. 7 గంటల పాటు వాహనాల్లో తిప్పిన పోలీసులు ఆయన ఇంటి వద్ద వదిలేశారు.

Kommalapati Sreedhar: ఇంటికి చేరుకున్న కొమ్మాలపాటి శ్రీధర్.. ఊపిరిపీల్చుకున్న టీడీపీ నేతలు

పల్నాడు: టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ (Kommalapati Sreedhar) ఇంటికి చేరుకున్నారు. 7 గంటల పాటు వాహనాల్లో తిప్పిన పోలీసులు ఆయన ఇంటి వద్ద వదిలేశారు. అయితే తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోరాటం ఆపేది లేదని కొమ్మాలపాటి శ్రీధర్ స్పష్టం చేశారు. పెదకూరపాడు (Pedakurapadu) ప్రజల తరపున నిత్యం పోరాడుతానని ప్రకటించారు. ఎమ్మెల్యే శంకర్‌రావు (MLA Shankar Rao) అవినీతి అక్రమాలను నిగ్గుతేలుస్తామని హెచ్చరించారు. శంకర్‌రావును ఇంటికి సాగనంపేవరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బహిరంగ చర్చకు ఏ రోజైనా తాను సిద్దమని శ్రీధర్ ప్రకటించారు. అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని శ్రీధర్ తేల్చి చెప్పారు. నదిలో తవ్విన గోతుల వల్లే అనేకమంది చనిపోతున్నారని తెలిపారు. టీడీపీ (TDP) హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమన్నారు. అలాగే ఇసుక దోపిడీ, మట్టి మాఫియా, ఇళ్ల నిర్మాణంపై చర్చకు కూడా సిద్ధమన్నారు. వైసీపీ (YCP) హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, ఆధారాలతో సహ చర్చకు వచ్చామని కొమ్మాలపాటి శ్రీధర్‌ ప్రకటించారు.

ఇసుక అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు, కొమ్మాలపాటి శ్రీధర్ చేసుకున్న సవాళ్లు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరుపక్షాలు అవినీతిపై చర్చించి అమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. ముందుగా శ్రీధర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి అమరలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శంకర్‌రావు కూడా అమరలింగేశ్వర ఆలయానికి వచ్చారు. తాను ఆధారాలతో వచ్చానని, ఏ తప్పు చేయలేదని అన్నారు. టీడీపీ వాళ్లు ప్రమాణం చేస్తే.. తాను కూడా ప్రమాణం చేస్తానని అన్నారు. అప్పటి వరకు ఆలయం వద్దే ఉంటానని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యేకు మద్దతుగా వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పోలీసులు శ్రీధర్‌ను అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌ చేసి పలువురిని అరెస్ట్‌ చేశారు. దీంతో పెదకూరపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఇసుక అక్రమ తవ్వకాలపై శంకరరావు, శ్రీధర్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమరలింగేశ్వర ఆలయం సమావేశం అవుదామని సవాళ్లు విసురుకున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతి పరిసరాల్లో ఆదివారం రాత్రి వరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతలకు 149 సీఆర్‌పీసీ (CRPC) నోటీసులు జారీ చేశారు. అమరావతి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. 5 మండలాల్లో 200 మంది నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. పసుపుచీర కట్టుకున్నాన్న కారణంతో తనను అరెస్టు చేశారని ఓ మహిళ వాపోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో అమరేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిని పోలీసులు మూసివేశారు.

Updated Date - 2023-04-09T18:35:45+05:30 IST