‘పేట వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

ABN , First Publish Date - 2023-04-06T01:22:18+05:30 IST

పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. దీంతో వేదికపై వున్న ఎమ్మెల్యే బాబూరావును ఆయన వర్గీయులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. తరువాత ఎమ్మెల్యే వర్గీయులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ వర్గీయులు తీవ్రస్థాయిలో ఘర్షణపడి పరస్పరం తోసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించేశారు. కాగా జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు తాము ఆహ్వానించనప్పటికీ ఎమ్మెల్యే వెనుక వుండే కొందరు నాయకులు వచ్చి గొడవ పెట్టుకుని తమను అవమానించారంటూ వీసం రామకృష్ణ వర్గీయులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.

‘పేట వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు
వేదికపై ఘర్షణపడుతున్న ఇరువర్గాల నాయకులు... ఎమ్మెల్యే బాబూరావును కిందకు తీసుకువస్తున్న గన్‌మన్‌, అనుచరులు

ఎమ్మెల్యే బాబూరావు సమక్షంలోనే రెండు వర్గాల వారు బాహాబాహీ

పరస్పరం తోపులాట... ఇద్దరికి స్వల్పగాయాలు

ఎమ్మెల్యే అనుచరుల తీరును నిరసిస్తూ హైవేపై స్థానికులు బైఠాయింపు

పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమణ.. స్టేషన్‌ వద్ద ధర్నా

సీఐల సూచనతో ముగ్గురు నాయకులపై పోలీసులకు ఫిర్యాదు

నక్కపల్లి, ఏప్రిల్‌ 5: పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీలో నివురుగప్పిన నిప్పులా వున్న వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సమక్షంలోనే బాహాబాహీకి దిగారు. దీంతో వేదికపై వున్న ఎమ్మెల్యే బాబూరావును ఆయన వర్గీయులు, పోలీసులు అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. తరువాత ఎమ్మెల్యే వర్గీయులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ వర్గీయులు తీవ్రస్థాయిలో ఘర్షణపడి పరస్పరం తోసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని పంపించేశారు. కాగా జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలకు తాము ఆహ్వానించనప్పటికీ ఎమ్మెల్యే వెనుక వుండే కొందరు నాయకులు వచ్చి గొడవ పెట్టుకుని తమను అవమానించారంటూ వీసం రామకృష్ణ వర్గీయులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

నక్కపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాబూరావు, ఆయన వర్గీయులు వచ్చారు. ఆయనతోపాటు అప్పటికే అక్కడ వున్న రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జడ్పీటీసీ సభ్యురాలు కాసులమ్మ, వైస్‌ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు తదితరులు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వీసం రామకృష్ణ వేదికపైకి వెళ్లి ఎమ్మెల్యేను, ఇతర ప్రజాప్రతినిఽధులు, నాయకులను ఆహానిస్తున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వర్గీయుడైన నక్కపల్లి పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జి యలమంచిలి తాతబాబు నేరుగా వేదికపైకి వెళ్లారు. దీంతో తీవ్రంగా స్పందించిన రామకృష్ణ.. ‘‘నేను ప్రొటోకాల్‌ ప్రకారం ఒక్కొక్కరిని పిలుస్తున్నాను కదా, నీ పేరు ఇంకా పిలవకుండానే వేదికపైకి ఎందుకు వచ్చావు?’’ అని ప్రశ్నించారు. ‘‘నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు?’’ అంటూ తాతబాబు సమాధానం ఇవ్వడంతో ఇరువర్గాల వారు గొడవ పడి తోసుకున్నారు. ఘర్షణ ముదురుతుండడంతో వేదికపై వున్న ఎమ్మెల్యే బాబూరావును పోలీసులు, ఆయన వర్గీయులు బయటకు తీసుకొచ్చారు. ఆ తరువాత కూడా ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ క్రమంలో వీసం వర్గీయులైన పొడగట్ల పాపారావు, అయినంపూడి మణిరాజు కిందపడిపోవడంతో స్వల్పగాయాలయ్యాయి. నక్కపల్లి, ఎస్‌.రాయవరం ఎస్‌ఐలు శిరీష, ప్రసాదరావు చేరుకుని ఇరువర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు.

హైవేపై ఆందోళన

బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే గొడవ పెట్టుకుని తమను అవమానించారంటూ ఎస్సీ కాలనీ వాసులతోపాటు ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, వైస్‌ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, వైసీపీ నాయకులు అల్లాడ కొండ, ఎల్లేటి సత్యనారాయణ, వీసం శ్రీను, వీసం రాజు, బంగార్రాజు తదితరులు హైవేపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వీసం రామకృష్ణపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో హైవేపై ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు 20 నిమిషాలపాటు ఎస్‌ఐలు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీఐలు వి.నారాయణరావు, అప్పలరాజు చెప్పడంతో ఆందోళన విరమించి ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే బాబూరావు వెంట వచ్చిన యలమంచిలి తాతబాబు, శీరం నరసింహమూర్తి, కొర్ని రాజా రమేశ్‌.. తమపై దాడికి ప్రయత్నించారని, దళిత ఎంపీపీ అయిన తనను దుర్భాషలాడి అవమానపర్చారని ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-06T01:22:18+05:30 IST