రాజకీయాలు మారిపోయాయి
ABN , First Publish Date - 2023-09-18T00:45:19+05:30 IST
నేటి రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా పలు విషయాలు వివరించారు
డబ్బుకు ప్రాధాన్యం పెరిగింది
చంద్రబాబు అరెస్టు సరికాదు
ఆయనకు పెద్దలంటే గౌరవం
పవన్ కల్యాణ్కు నిజాయితీ, గ్లామర్ ఉన్నాయి..
ఓటర్లలో ఆలోచనా శక్తి పెరిగింది
ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ నేత కరాటం రాంబాబు
కొయ్యలగూడెం, సెప్టెంబరు17 : చంద్రబాబు పెద్దల పట్ల గౌరవం కలిగిన వ్యక్తి. 2003లో అప్పటి టీడీపీ నాయకులు కొవ్వూరు నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి నాపై తప్పుడు కేసు బనాయించారు. పోలీసులను ఇంటికి పంపించారు. ఆ కేసు జిల్లాలో సంచలనం రేగింది. ఆ సమయంలో మంత్రిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసి కరాటం రాంబాబు జిల్లాలో పెద్దమనిషని ఆయనపై తప్పుడు కేసులు పెట్టారని దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పగానే స్పందించి అప్పటి డీఐజీకి ఫోన్ చేశా రు. పెద్దలపై తప్పుడు కేసులు పెడితే ఎందుకు సమర్థిస్తున్నారని హెచ్చరించారు. టీడీపీ నాయకులను మందలించారు. అటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తి చంద్రబాబు. ఆయనపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం సరికాదు.. నేటి రాజకీయ పరిస్థితులు, చంద్రబాబు అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబును ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా పలు విషయాలు వివరించారు..
జనసేన – టీడీపీ పొత్తు ఎలా ఉంటుంది ?
రెండు పార్టీల నాయకులను సమన్వయం చేసి నడిపించగలిగితే విజయం సాధిస్తారు. ఆ సమన్వయాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి.
చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వం తీరు ఎలా ఉంది ?
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఈ విధంగా అరెస్టు చేయడం సరికాదు. విచారణ చేయాలి. తప్పులు ఉంటే ఆ తప్పులను ప్రజలకు చూపించి అప్పుడు అరెస్టు చేయాలి. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు.
గతంలో ఎప్పుడైన ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా ?
ఇటువంటి ఘటనలు ఎప్పుడు చూడలేదు. వినలేదు. తమిళనాడులో ఇటువంటి పరిస్థితులు ఉండేవి. మన రాష్ట్రంలో అటువంటి సంస్కృతి లేదు. గతంలో కాంగ్రెస్, టీడీపీలు ఒకరిపై ఒకరు విమర్శించుకునేవారు. అవినీతి ఉంటే పోరాటం చేసేవారు. అయితే ఒక పద్ధతి ప్రకారం విమర్శలు ఉండేవి. ఆ సంస్కృతి ఇప్పుడు లేదు.
చంద్రబాబు అరెస్టుతో పార్టీ బలహీనపడుతుందా ?
జైళ్ళో పెట్టడం వల్ల ఇంకా సానుభూతి పెరుగుతుంది. వైసీపీ చేస్తున్న ఇటువంటి సంఘటనలకు టీడీపీకి మైలేజ్ పెరుగుతుంది.
నాడు–నేడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?
50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇటువంటి వాతావరణం చూడలేదు. వైఎస్ రాజశేఖర్రెడ్డికి కోపం ఉండేది. కాని ప్రతిపక్షాలపై గొడవలు చేస్తే అభివృద్ధి ఆగిపోతుందనే దృక్పథంతో ఉండేవారు. తప్పుడు ఫిర్యాదులు, కేసులు ఒప్పుకునేవారు కాదు. అప్పట్లో మంచి వ్యక్తులను గుర్తించి పదవులు ఇస్తే ఇప్పుడు డబ్బున్నవారిని గుర్తించి ఇచ్చే సంస్కృతి వచ్చింది.
ఓటర్ల్ల పరిస్థితి ఎలా ఉంది ?
ఆలోచనా శక్తి పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు ఓటు వెయ్యడానికి ఆలోచిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్కి తేడా ?
వైఎస్ రాజశేఖర్రెడ్డితో 22 ఏళ్ళ స్నేహం ఉంది. పాదయాత్రకి ముందు ఒక విధంగా ఉన్నా పాదయాత్ర తరువాత మంచి స్వభావాన్ని సంతరించుకున్నారు. ఆరోగ్యశ్రీ, 108 వంటి పథకాలు పెట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
పవన్ కల్యాణ్లో ప్లస్, మైనస్ ఏమిటి ?
పవన్కి నిజాయితీ, గ్లామరు ఉన్నాయి. అయితే నెట్వర్క్ చేసే సరిపడ టీమ్లు లేకపోవడం మైనస్. పార్టీ పెట్టిన తర్వాత మా ఇంటికి వచ్చినప్పుడు ప్రజలతో మనస్సుతో, నాయకులతో మేథస్సుతో మాట్లాడాలని సూచించాను.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ?
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా కులాలతో అల్లుకుపోయి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు అన్ని కులాలను ఒకేలా చూసినప్పుడే అందరూ సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతారు.