వన్నెల దొరసాని

ABN , First Publish Date - 2023-01-28T01:08:43+05:30 IST

‘ఆత్మాభిమానం, కాఫీ.. ఈ రెండు విషయాల్లో నేను రాజీపడలేను’ అంటుండేవారు భానుమతీరామకృష్ణ. భానుమతిని అభిమానించే నటి జమునది కూడా అదే ధోరణి. సినిమాల్లో

వన్నెల దొరసాని

‘ఆత్మాభిమానం, కాఫీ.. ఈ రెండు విషయాల్లో నేను రాజీపడలేను’ అంటుండేవారు భానుమతీరామకృష్ణ. భానుమతిని అభిమానించే నటి జమునది కూడా అదే ధోరణి. సినిమాల్లో నటించే ఆడవాళ్లకు ఏ మాత్రం గౌరవం లేని రోజుల్లో చిత్ర పరిశ్రమలోకి వచ్చి, తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న మహిళలు వీరిద్దరూ. అలాగే పురుషాధిక్యత కలిగిన చిత్ర పరిశ్రమలో కూడా నెగ్గి నిలబడగలిగారు. జమున ఆత్మగౌరవం కోసం అహంకారాన్ని అద్దెకు తెచ్చుకున్నారు. సినిమారంగంలో స్త్రీ కాలు మీద కాలు వేసుకుని కూర్చోకపోతే మగవాడు అవకాశం తీసుకుని చెలరేగిపోతాడని ఆమె నమ్మకం. అగ్ర హీరోల ముందు కూడా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో వారి ఆగ్రహానికి గురైనా ఆమె లక్ష్య పెట్టలేదు, చివరకు కెరీర్‌ పణంగా పెట్టాల్సివచ్చినా రాజీ పడలేదు. సాటి హీరోయిన్లు అంతా సినిమా వారికే భార్యగానో, రెండుమూడు పెళ్ళిళ్ళు చేసుకున్నవారితోనో స్థిరపడిపోతున్న తరుణంలో ఆమె ఓ విద్యావంతుణ్ణి వివాహం చేసుకున్నారు. పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని, విద్యాధికుడిని పెళ్లాడిన తొలి తెలుగు హీరోయిన్‌ ఆమె.

పెళ్లికి ముందే భర్తతో ‘మీకు ఇష్టమైతే నటిస్తాను. తర్వాత లేనిపోని అపార్థాలు అనవసరం’ అని స్పష్టంగా తేల్చుకున్నారు ఆమె. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్‌ ముగిసిపోతుందని అంటుంటారు. కానీ పెళ్లయిన పదేళ్ల తర్వాత, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్‌గా కొనసాగిన అరుదైన ఘనత జమునది. సినిమాల్లోనే కాదు రాజకీయరంగంలోనూ తన ప్రత్యేకతను చాటారు. పార్లమెంట్‌లో మహిళల సమస్యలపై వాడిగా, వేడిగా తన వాణి వినిపించారు. సాధారణంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు, ముఖ్యంగా మహిళాసభ్యులకు పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం దక్కడం అరుదు. కానీ జమున ఆ అవకాశాన్ని వెంటపడిమరీ సాధించుకున్నారు.

ఈ పాత్రకు జమున అయితేనే న్యాయం చేస్తుంది అనే ఆలోచనా ధోరణి ఆమెతోనే మొదలైంది. ఎన్టీఆర్‌ నిర్మించిన ‘గులేబకావళి కథ’ సినిమాలో ఆమెది మొదట వేశ్య పాత్రట. అయితే తను ఆ పాత్ర చేస్తుండడంతో రూపురేఖలు కొంచెం మార్చమని ఎన్టీఆర్‌ను అడిగారు. ఆమె కోరిక మన్నించి ఎన్టీఆర్‌ ఆ పాత్ర స్వభావాన్ని మార్చారు. ఆ చిత్రం జమునకు పేరు తెచ్చింది. ‘మూగ మనసులు’ చిత్రంలోని గౌరి పాత్ర కూడా అంతే. ‘పండంటి కాపురం’ చిత్రంలో రాణీ మాలినీ దేవి పాత్ర జమున స్వభావానికి అద్దం పడుతుంది. ‘ద విట్నెస్‌’ అనే ఆంగ్ల చిత్రంలోని ఓ పాత్ర ప్రేరణతో రాణీ మాలినీ దేవి పాత్ర పుట్టింది. ఆంగ్లచిత్రంలో ఆ పాత్రలో కొంచెం క్రూరత్వం ఉంటుంది. కానీ తెలుగులో జమున ఆ పాత్ర పోషిస్తుండడంతో మార్చి, చివరకు సానుభూతి పొందే విధంగా తీర్చిదిద్దారు. సినిమా విజయవంతం కావడమే కాదు, ఆ పాత్ర కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. నిజానికి, రాణీ మాలినీదేవి పాత్రకు మొదట భానుమతిని అనుకున్నారట. తనకు అనూహ్యంగా దక్కిన ఆ పాత్రకు జమున నూరుశాతం న్యాయం చేశారు.

రొటీన్‌ హీరోయిన్‌ పాత్రలు కాకుండా కాస్త భిన్నంగా వెళ్లి, పేరు తెచ్చుకున్న నటీమణుల్లో జమున తర్వాతే మరెవరైనా. నర్గిస్‌ నటించిన ‘మదర్‌ ఇండియా’ సినిమాను తెలుగులో తీస్తున్నప్పుడు అందులో హీరోయిన్‌గా చేయమని జమునని అడిగారు. అందరూ ఆ పాత్ర చేయవద్దని వారించారు, హెచ్చరించారు. కానీ జమున ధైర్యంగా ముందుకు వచ్చి ఆ పాత్ర చేశారు. అదే ‘బంగారు తల్లి’ చిత్రం. ఒకవైపు వేరే చిత్రాల్లో గ్లామర్‌ పాత్రలు పోషిస్తూ ఈ సినిమాలో వృద్ధురాలిగా, అందులోనూ శోభన్‌బాబు, కృష్ణంరాజులకు తల్లిగా నటించడానికి ఆమె సంశయించలేదు. అటువంటి ప్రయోగాలు తన సినీజీవితంలో చాలా చేశారామె. దర్శకత్వం వహించాలనే కోరిక సినిమాల ద్వారా తీరలేదు కానీ, తన కుమార్తె హీరోయిన్‌గా ఓ టీవీ సీరియల్‌ తీసి, దర్శకత్వం వహించి ఆ ముచ్చటా తీర్చుకున్నారు.

గరికపాటి రాజారావు ప్రజానాట్యమండలి నాటకాలనుంచి వచ్చారామె. ఆ తరువాత ఆయన ‘పుట్టిల్లు’ సినిమాతోనే ఈ రంగంలోకి ప్రవేశించారు. బయటివ్యక్తిత్వానికి తగినట్టుగా ఉన్న ‘సత్యభామ’ వంటి అహంకార పాత్రలతో పాటు, అప్పుచేసి పప్పుకూడు, దొంగరాముడు వంటి కొన్ని చిత్రాల్లో అమాయకపాత్రలు కూడా అద్భుతంగా పోషించి జనాన్ని మెప్పించగలిగారామె. కానీ, ఉపరితలంలో పొగరుగా కనిపించే ఆత్మవిశ్వాసం ఉన్నపాత్రలు ఆమెను జనం మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేట్టు చేశాయి.

Updated Date - 2023-01-28T01:08:44+05:30 IST