Share News

Navodaya: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

ABN , First Publish Date - 2023-11-14T15:09:03+05:30 IST

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో లేటరల్‌ ఎంట్రీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ను

Navodaya: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో లేటరల్‌ ఎంట్రీకి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సెలెక్షన్‌ టెస్ట్‌ ద్వారా తొమ్మిది, పదకొండు తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇవి కో-ఎడ్యుకేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు. బాల బాలికలకు విడివిడిగా హాస్టల్స్‌ ఉంటాయి. భోజన, వసతి సౌకర్యాలతోపాటు బోధన ఉచితం. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తారు. విద్యార్థులు విద్యాలయ వికాస్‌ నిధి కోసం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు; దివ్యాంగులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు; పేదింటి పిల్లలకు దీని నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే నెలకు రూ.1500 చెల్లించాలి. మేథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో; సోషల్‌ సైన్స్‌ను హిందీ/ఇంగ్లీ్‌షలో బోధిస్తారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది.

సీట్ల వివరాలు

  • తొమ్మిదో తరగతిలో మిగిలిన సీట్లు: ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం 14, చిత్తూరు 19, తూర్పు గోదావరి 10, గుంటూరు 11, అన్నమయ్య (కడప) 9, కృష్ణ 12, కర్నూలు 6, నెల్లూరు 13, ప్రకాశం 28, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 11, విజయనగరం 8, పశ్చిమ గోదావరి 8, అల్లూరి సీతారామరాజు(తూర్పు గోదావరి) 2 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్‌ 9, కరీంనగర్‌ 5, ఖమ్మం 6, మహబూబ్‌నగర్‌ 9, మెదక్‌ 8, నల్లగొండ 7, నిజామాబాద్‌ 16, రంగారెడ్డి 9, వరంగల్‌ 4 సీట్లు ఉన్నాయి.

  • రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జేఎన్‌వీల్లో పదకొండో తరగతికి సంబంధించి సైన్స్‌ గ్రూప్‌ సీట్లు ఉన్నాయి. ఖమ్మం, చిత్తూరు, గుంటూరు జేఎన్‌వీల్లో మాత్రమే కామర్స్‌ గ్రూప్‌ సీట్లు మిగిలాయి.

అర్హత

  • తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు. వీరు 2009 మే 1 నుంచి 2011 జూలై 11 మధ్య జన్మించి ఉండాలి. పదకొండో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం పదోతరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 2007 జూన్‌ 1 నుంచి 2009 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

సెలెక్షన్‌ టెస్ట్‌ వివరాలు

  • దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పరీక్ష సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

  • తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో ఇంగ్లీష్‌, హిందీ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 15 ప్రశ్నలు; మేథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 35 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఎనిమిదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. అభ్యర్థుల మెరిట్‌ జాబితా రూపొందించేందుకు మేథమెటిక్స్‌, సైన్స్‌, ఎక్కువ స్కోర్‌ ఉన్న లాంగ్వేజ్‌(ఇంగ్లీ్‌ష/హిందీ) మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు.

  • పదకొండో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షలో మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లీష్‌, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల నుంచి ఒక్కోదానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో అర్హత పొందాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం ఆరు మార్కులు రావాలి. అభ్యర్థుల మెరిట్‌ జాబితా రూపొందించేందుకు సైన్స్‌ గ్రూప్‌ అభ్యర్థులకు మెంటల్‌ ఎబిలిటీ, సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను; కామర్స్‌ గ్రూప్‌ అభ్యర్థులకు మెంటల్‌ ఎబిలిటీ, సోషల్‌ సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిలో మొత్తం 60 మార్కులకుగాను జనరల్‌ బాలురకు 21, జనరల్‌ బాలికలకు 20; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 మార్కులు రావాలి.

ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 15

కరెక్షన్‌ విండో ఓపెన్‌: నవంబరు 16 నుంచి 17 వరకు

సెలెక్షన్‌ టెస్ట్‌ తేదీ: 2024 ఫిబ్రవరి 10

వెబ్‌సైట్‌: www.navodaya.gov.in

Updated Date - 2023-11-14T15:11:16+05:30 IST