Land Sinking: జోషిమఠ్, కర్ణప్రయాగ్ బాటలోనే చంబా టౌన్

ABN , First Publish Date - 2023-01-11T18:29:56+05:30 IST

ఉత్తరాఖండ్ వణికిపోతోంది. ఇళ్లు, భవంతులు బీటలు వారుతూ, భూములు కుంగిపోతూ ఆందోళనలకు కేంద్ర బిందువు అవుతోంది. జోషిమఠ్‌లో మొదలైన ఈ ఉత్పాతం..

Land Sinking: జోషిమఠ్, కర్ణప్రయాగ్ బాటలోనే చంబా టౌన్

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand) వణికిపోతోంది. ఇళ్లు, భవంతులు బీటలు వారుతూ, భూములు కుంగిపోతూ ఆందోళనలకు కేంద్ర బిందువు అవుతోంది. జోషిమఠ్‌లో మొదలైన ఈ ఉత్పాతం కర్ణప్రయాగ్‌కు చేరుకోగా, తాజాగా తెహ్రి జిల్లా చంబా టౌన్‌ (Chamba Town) లోనూ ఈ పరిస్థితి తలెతెత్తింది. పలుచోట్ల భూమి కుంగిపోతూ ఇళ్లు, భవంతులకు పగుళ్లు ఏర్పడ్డాయి. తెహ్రి చెరువు సమీపంలోని గ్రామాల్లో కొండచరియలు విరిగిపడుతుండటం, చంబా టన్నెల్‌కు ఎగువ, సమీపంలోని పలు ఇళ్లలో పగుళ్లు కనిపిస్తూ, అవి క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో సుమారు డజనుకు పైగా కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి.

ఆల్-వెదర్ ప్రాజెక్టు కింద 440 మీటర్ల పొడవైన టన్నెల్‌ను చంబాలో నిర్మించారు. టన్నెల్ నిర్మాణం తరువాత చంబా ప్రధాన మార్కెట్ ప్రాంతంలోని ఇళ్లలో పగుళ్లు మొదలయ్యాయి. దీనిపై దీపక్ తివారీ అనే స్థానికుడు మాట్లాడుతూ, టన్నెల్ నిర్మాణం మొదలైనప్పటి నుంచి ఇళ్లకు పగుళ్ల మొదలయ్యాయని, దీనిపై పలు సర్వేలు జరిగనప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. 2019లో తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించామని తెలిపారు. జోషిమఠ్ విషయంలో తీసుకుంటున్న చర్యల తరహాలోనే ఇక్కడ కూడా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామని అన్నారు. కాగా, జోషిమఠ్‌లో 723 ఇళ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 131 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Updated Date - 2023-01-11T18:29:57+05:30 IST