Heatwave: వడగాలుల తీవ్రతపై రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

ABN , First Publish Date - 2023-06-20T17:15:10+05:30 IST

వడగాలుల తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Heatwave: వడగాలుల తీవ్రతపై రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

న్యూఢిల్లీ: వడగాలుల (Heatwave) తీవ్రతతో పలు రాష్ట్రాలు అల్లాడుతుండంతో కేంద్రం అప్రమత్తమైంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని మంగళవారంనాడు నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ (Mansukh Mandaviya) ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో పాటు, భారత వాతావరణ శాఖ (IMD) సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఆరోగ్య శాఖ, ఐఎండీకి చెందిన ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, వడగాలుల తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక బృందం పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తుందని కేంద్ర మంత్రి మాండవీయ తెలిపారు. వేడిగాలుల వల్లే ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని కూడా కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు మంత్రి ఆదేశించారు. సాధారణ ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని స్థాయిల్లోనూ తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వర్చువల్ భేటీ నిర్వహిస్తామని చెప్పారు.

కాగా, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో తీవ్రమైన వేడిగాలుల నుంచి అతితీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత కొద్దిరోజులుగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులకు పలువురు మృతి చెందినట్టు వార్తలు వెలుగుచూస్తున్నాయి. పలురాష్ట్రాలు వేసవి సెలవులను పొడిగించాయి.

Updated Date - 2023-06-20T17:15:10+05:30 IST