Kannada politics Amul : కన్నడ రాజకీయాల్లో అమూల్‌ చిచ్చు

ABN , First Publish Date - 2023-04-10T01:16:38+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల వ్యాపార సంస్థ చేసిన ట్వీట్‌ రాజకీయంగా వివాదానికి దారితీసింది. బెంగళూరులో తాము ఆన్‌లైన్‌ వ్యాపారానికి సిద్ధమని అమూల్‌ పేర్కొంది.

Kannada politics Amul  : కన్నడ రాజకీయాల్లో అమూల్‌ చిచ్చు
Amul

బెంగళూరులో వ్యాపారానికి అమూల్‌ రెడీ.. మండిపడిన కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌

దీనిని బీజేపీ కుట్రగా పేర్కొన్న కాంగ్రెస్‌

ఇది.. మోదీ, షా కుతంత్రం: జేడీఎస్‌

రాష్ట్రంలోకి అమూల్‌ రాదు: బీజేపీ

బెంగళూరు, ఏప్రిల్‌ 9: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల వ్యాపార సంస్థ చేసిన ట్వీట్‌ రాజకీయంగా వివాదానికి దారితీసింది. బెంగళూరులో తాము ఆన్‌లైన్‌ వ్యాపారానికి సిద్ధమని అమూల్‌ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ సహా పాల ఉత్పత్తి దారులు విరుచుకుపడ్డారు. రాష్ట్ర సొంత పాల ఉత్పత్తి దారుల సంస్థ కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే గుజరాత్‌కు చెందిన అమూల్‌ను తీసుకువస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు నిప్పులు చెరిగారు. అమూల్‌ పాల ఉత్పత్తులను కొనబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం సిద్దరామయ్య పిలుపునిచ్చారు. అయితే.. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాలవీయ.. అలాంటిదేమీ లేదన్నారు. కర్ణాటకలోకి అమూల్‌ అడుగు పెట్టదని స్పష్టం చేశారు. అంతేకాదు.. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2019 తర్వాత కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ రూ.10 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు పెరిగిందని.. రూ.20 వేల కోట్లు రాష్ట్రంలోని పాడి రైతులకు చేరాయని ఆయన వివరించారు. ఇక, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కూడా రాష్ట్ర పాల ఉత్పత్తి దారుల సమాఖ్య నేతృత్వంలోని నందిని సంస్థకు దన్నుగా నిలుస్తామన్నారు.

ఏం జరిగింది?

గుజరాత్‌కు చెందిన ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌(అమూల్‌) నాలుగు రోజుల కిందట ట్విట్టర్‌ వేదికగా ఒక ప్రకటన చేసింది. బెంగళూరులో తాము ఆన్‌లైన్‌ వ్యాపారం చేయనున్నట్టు పేర్కొంది. ఈ ప్రకటనపై కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) నేతృత్వంలోని ‘నందిని’ డెయిరీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై జోక్యం చేసుకున్న ప్రధాన ప్రతిపక్షం కాం గ్రెస్‌ నేతలు.. బీజేపీపై విరుచుకుపడ్డారు. కమలనాథు లు కుట్రలకు తెరదీశారని, రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల ను నిర్వీర్యం చేసేందుకు నడుంబిగించారని విమర్శలు సంధించారు. కేఎంఎఫ్‌ మూసివేసి.. రైతుల పొట్టగొట్టేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని దుయ్యబట్టారు. గుజరాత్‌కు చెందిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దొడ్డిదారిలో అమూల్‌ను రాష్ట్రంలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

నందిని పీక నులుముతున్నారు!

కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రేతర పాల ఉత్పత్తులు తమకు అవసరం లేదని, నందిని బ్రాండ్‌ అమూల్‌ కన్నా మంచిదన్నారు. ‘‘మా పాలు, మా పాల ఉత్పత్తి దారులను సంరక్షించుకోవాలని మేం భావిస్తున్నాం’’ అని డీకే వ్యాఖ్యానించారు. మరో ప్రతిపక్షం జేడీఎస్‌ కూడా అమూల్‌ రాకపై విమర్శలు గుప్పించింది. నందిని పాల ఉత్పత్తి దారుల పరిస్థితి ఏంటని నిలదీసింది. ‘‘నేరుగా విలీనం కుదరదు కాబట్టి, ఇలా దొడ్దిదారి వ్యూహాలు పన్నుతున్నారు. నందిని పీక నులుముతున్నారు. ఇది ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా కుతంత్రం’’ అని విరుచుకుపడింది. ఈ విమర్శలపై సీఎం బొమ్మై స్పందిస్తూ.. అమూల్‌ను రాజకీయం చేయొద్దన్నారు.

Updated Date - 2023-04-10T01:16:38+05:30 IST