భారత్ చర్య ఆందోళనకరం
ABN , First Publish Date - 2023-09-26T01:39:32+05:30 IST
భారత్ తమ పౌరులకు వీసాలు నిలిపివేయడం సహా తీసుకున్న చర్యలు ఆందోళనకరమని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ అన్నారు...

వీసాల నిలిపివేత సరికాదు.. నిజ్జర్ హత్యపై ఆరోపణలు నిజమైతే పరిణామాలు తీవ్రం
కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ వ్యాఖ్యలు
టొరంటో, న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: భారత్ తమ పౌరులకు వీసాలు నిలిపివేయడం సహా తీసుకున్న చర్యలు ఆందోళనకరమని కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ అన్నారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తులో భారత్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా నిజాలను వెలికితీసేందుకు, ఈ వివాదాన్ని సరైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు కలిసిరావాలని కోరారు. కెనడా జాతీయ టీవీ చానల్ ’సీబీసీ’తో పాటు ‘ది వెస్ట్ బ్లాక్’కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాలో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరికి భారత్తో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని పేర్కొంటూ వీసాలు నిలిపివేయడం తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. భారత్తో సంబంధాలు ముఖ్యమని చెబుతూనే నిజ్జర్ హత్య విషయంలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇది తమ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని, పౌరులను, చట్టాలను రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. కాగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిక్స్ ఫర్ జస్టిస్’ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ఆడియో మెసేజ్లు లభించినట్టు సమాచారం. భారత్ను ముక్కలు చేయాలన్నది అతని కోరిక అని వాటి ద్వారా తెలుస్తోంది. కశ్మీర్ ప్రత్యేక దేశం, ముస్లిం దేశం ఏర్పాటు చేస్తామని వాటిలో పేర్కొన్నాడు.
భారత ఎంబసీల ముందు నిరసనలు
కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ముందు సోమవారం ఖలీస్థానీ వేర్పాటువాదులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హింస తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టొరంటో, ఒట్టావా, వాంకోవర్లోని ఎంబసీల ముందు నిరసనలు చేపట్టాలని కెనడాలోని ‘సిఖ్ ఫర్ జస్టిస్’ సంస్థ ఆదివారం కోరింది. భారత రాయబారిని బహిష్కరించాలని ఆ సంస్థ డైరెక్టర్ జతిందర్ సింగ్ గ్రేవాల్ డిమాండ్ చేశారు.
లఖ్బీర్ కోసం 48 చోట్ల దాడులు..
ఖలీస్థానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ లందా, అతని అనుచరుల కోసం పంజాబ్ పోలీసులు సోమవారం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఫిరోజ్పూర్, దాని సమీప ప్రాంతాల్లో 48 చోట్ల దాడులు చేశారు. ఫిరోజ్పూర్లోని జీరా ప్రాంతంలో లఖ్బీర్ దోపిడీకి పాల్పడి.. కాల్పులు జరిపినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గాలింపు చేపట్టారు.
భారత్లో జాగ్రత్త.. పౌరులకు కెనడా హెచ్చరిక
ఇరు దేశాల మఽధ్య ఉద్రికత్తల రీత్యా కెనడా తమ పౌరులకు ట్రావెల్ అప్డేట్ ఇచ్చింది. భారత్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. కెనడా పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం, సోషల్ మీడియాలోనూ నిరసనలకు పిలుపులు వస్తున్న సంగతిని ప్రస్తావించింది.
కరన్వీర్పై ఇంటర్పోల్ కన్ను
బబ్బర్ఖల్సా సభ్యుడు, ఖలిస్థానీ కరన్వీర్ సింగ్ను ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. అతడిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. హత్య, ఆయుధాల చట్టం, ఉగ్ర కుట్ర సహా అనేక కేసుల్లో కరన్వీర్ నిందితుడు.
బంధం బలపర్చుకుందాం
అరుణాచల్ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఉషూ ఆటగాళ్లకు చైనా వీసా నిరాకరించడంపై వివాదం కొనసాగుతున్నవేళ.. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆ దేశ రాయబరి ఝా లియూ పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి భారత్- చైనా మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని, ఇరు దేశాల నాయకులు చర్చలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారానికి చైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచ అభివృద్ధి, శాంతి స్థాపనకు భారత్ సహా అన్నీ దేశాలతో పనిచేయడానికి చైనా సిద్ధమని ఓ కార్యక్రమంలో ఆయన చెప్పారు.