Char Dham yatra: జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవేపై కొత్తగా పగుళ్లు

ABN , First Publish Date - 2023-02-20T15:48:43+05:30 IST

ఛార్‌ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవే‌పై కొత్తగా కొన్ని పగుళ్లు...

Char Dham yatra: జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవేపై కొత్తగా పగుళ్లు

డెహ్రాడూన్: ఛార్‌ ధామ్ యాత్ర (Char Dham Yatra) రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానున్న తరుణంలో జోషిమఠ్ సమీపంలోని బద్రీనాథ్ హైవే‌పై కొత్తగా కొన్ని పగుళ్లు (Cracks) కనిపించాయి. జోషిమఠ్, మార్వరి మధ్య 10 కిలోమీటర్ల మేర ఈ పగుళ్లు కనిపించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా మార్వారి బ్రిడ్జి, రైల్వే గెస్ట్ హౌస్ సమీపంలోని ఎస్‌బీ బ్రాంచ్ ఎదుట పగుళ్లు విస్తరించినట్టు స్థానికులు తెలిపారు. పగుళ్లకు కారణాలు, భూమి కుంగిపోవడానికి-పగుళ్లకు ఏదైనా సంబంధం అందా అనే దానిపై నిపుణులు సమగ్ర దర్యాప్తు జరపాల్సి ఉంటుందని సీనియర్ జియాలజిస్ట్ ఒకరు తెలిపారు. జిల్లా అధికారులు మాత్రం ఈ విషయంపై ఇంకా పెదవి విప్పనప్పటికీ, పగుళ్లకు కారణాలను నిపుణుల బృందం పరిశీలిస్తోందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఛమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా తెలిపారు.

దీనికి ముందు కూడా, ఇటీవల హైవేపై పగుళ్లు కనిపించడంతో సరిహద్దు రోడ్ల నిర్వహణా సంస్థ (BRO) వెంటనే వాటిని సిమెంట్‌తో మరమ్మతు చేసింది.

మరోవైపు, బహుగుణ నగర్, సుభాష్ నగర్, కన్యాప్రయాక్ అప్పర్ బజార్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజలను జిల్లా యంత్రాగం అప్రమత్తం చేసింది. బాధిత ప్రాంతాల్లో ఛమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా పర్యటించారు. బాధిత ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి తీవ్రంగా పగుళ్లు వచ్చిన ఇళ్లలో ఉంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఖురానా తెలిపారు. అద్దె ఇళ్లలోకి వెళ్లాలనుకునే వారికి ఆరు నెలల పాటు తామే అద్దె చెల్లిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఎస్‌డీఎంలను ఆయన ఆదేశించారు. భవంతుల్లో పగుళ్లను మానిటర్ చేసేందుకు క్రాకోమీటర్లను అమర్చినట్టు ఆయన చెప్పారు.

దీనికి ముందు, భూమి కృంగిపోయిన కారణంగా నిరాశ్రయులైన వారికోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాలను ఈనెల 2న ఖురానా తనిఖీ చేశారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. కాగా, ఇంతవరకూ 863 భవంతులకు పగుళ్లు వచ్చినట్టు గుర్తించినట్టు రాష్ట్ర డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ (ఎస్‌డీఎంఏ) ఇటీవల ప్రకటించింది.

Updated Date - 2023-02-20T15:48:45+05:30 IST