Biofuel Alliance : ప్రపంచం కోసం భారత్‌.. జీవ ఇంధన కూటమి

ABN , First Publish Date - 2023-09-10T05:07:36+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రియ వ్యర్థాల నుంచి తయారయ్యే జీవ ఇంధనాల అంశంలో ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతదేశం కీలక అడుగు వేసింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పెట్రోల్‌లో 20 ..

 Biofuel Alliance : ప్రపంచం కోసం భారత్‌.. జీవ ఇంధన కూటమి
Biofuel Alliance

జీ20 సదస్సు వేదికగా మోదీ ప్రకటన

అన్ని దేశాలు భాగం కావాలని పిలుపు

పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ కలపాలని సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రియ వ్యర్థాల నుంచి తయారయ్యే జీవ ఇంధనాల అంశంలో ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతదేశం కీలక అడుగు వేసింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలపాలని పిలుపునిస్తూ.. ‘ప్రపంచ జీవ ఇంధన కూటమి’ని ఏర్పాటు చేసింది. భారత్‌ ఆతిథ్యమిస్తోన్న జీ20 సదస్సు వేదికగా ప్రధాని మోదీ శనివారం ఈ కూటమిని ప్రకటించారు. అంతేకాక, ఈ కూటమిలో అందరూ భాగం కావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. అలాగే, పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనానికి జీ20 శాటిలైట్‌ మిషన్‌ను ప్రతిపాదించారు. ఈ మేరకు భారత్‌ మండపంలో శనివారం నిర్వహించిన జీ20 సదస్సుకు వివిధ దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ఒకే భూమి అంశంపై మాట్లాడుతూ జీవ ఇంధనాలు, ఇంధన పరివర్తన, చంద్రయాన్‌ సహా అనేక అంశాలను ప్రస్తావించారు. పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులు దృష్ట్యా ఇంధన పరివర్తన సాధించడం 21వ శతాబ్ధంలో అత్యంత ప్రాధాన్యమున్న అంశమని మోదీ పేర్కొన్నారు. సమ్మిళిత ఇంధన పరివర్తనకు ట్రిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చెయ్యాల్సి ఉంటుందని, ఈ అంశంలో అభివృద్ధి చెందిన దేశాలది కీలకపాత్ర అని చెప్పారు. పర్యావరణం కోసం 100 బిలియన్‌ డాలర్లు సమకూరుస్తామని చేసిన హామీని నెరవేరుస్తామని అభివృద్ధి చెందిన దేశాలు ప్రకటించడంపై భారత్‌ సహా అనేక దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు.

ఇంధన భద్రత ఆవశ్యకతను గుర్తించి ఇంధన పరివర్తన అంశంపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలని కోరారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచ అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయంగా మరో ఇంధన మిశ్రమాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ, ఇంధన కొరతకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇంధన భద్రత, వాతావరణ మార్పులపై భయాందోళన నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్‌.. ప్రపంచ జీవ ఇంధన కూటమి(గ్లోబల్‌ బయోఫ్యూయల్‌ అలయెన్స్‌)ని ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు. ఈ కూటమిలో భాగం కావాలని అన్ని దేశాలను ఆహ్వానించారు. ఇక, కర్భన ఉద్గారాల పరిమితులపై ఎన్నో ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా అవి ప్రపంచంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించేందుకు తాము ప్రారంభించిన గ్రీన్‌ క్రెడిట్‌ కార్యక్రమాన్ని జీ20 దేశాలన్నీ పాటించాలని కోరారు. ఇక, భారత్‌ చేసిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మోదీ.. చంద్రుని నుంచి తాము సేకరించే సమాచారం మానవాళి మొత్తానికి ఉపయోగపడనుందని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో పర్యావరణ, వాతావరణ మార్పుల అధ్యయనానికి భారత్‌.. జీ20శాటిలైట్‌ మిషన్‌ను ప్రతిపాదిస్తుందని మోదీ చెప్పారు. జీ20 శాటిలైట్‌ ద్వారా సేకరించిన సమాచారం అన్ని దేశాలకు అందించాలని, ఈ మిషన్‌లోనూ సభ్య దేశాలన్నీ భాగం కావాలని భారత్‌ కోరుకుంటున్నదని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-10T05:07:57+05:30 IST