Operation Kaveri: సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్ కావేరి’

ABN , First Publish Date - 2023-04-24T18:38:43+05:30 IST

ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్‌(Sudan)లో

 Operation Kaveri: సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ‘ఆపరేషన్ కావేరి’

న్యూఢిల్లీ: ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్‌(Sudan)లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’(Operation Kaveri)ని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభమైందని, దాదాపు 500 మంది భారతీయులు పోర్ట్ సూడాన్‌(Port Sudan)కు చేరుకున్నారని, మరికొందరు దారిలో ఉన్నారని ఆయన తెలిపారు.

వారిని స్వదేశానికి తరలించేందుకు మన నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. సూడాన్‌లో చిక్కుకున్న మన సహోదరులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. గతంలో ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan), ఉక్రెయిన్‌(Ukraine)లో చిక్కుకున్న భారతీయులను కూడా కేంద్రం ఇలాంటి ఆపరేషన్ల ద్వారా వెనక్కి తీసుకొచ్చింది.

సూడాన్‌లో దాదాపు 4 వేల మంది భారతీయులు ఉన్నట్టు అంచనా. వీరిని వెనక్కి తీసుకొచ్చేందుకు రెండు సి-130 విమానాలు, ఐఎన్ఎస్ సుమేధా నౌకను ప్రభుత్వం సిద్ధం చేసింది. సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) భీకరంగా తలపడుతున్నాయి. దీంతో దేశంలో అశాంతి నెలకొంది. వేలాదిమంది సూడానీలు దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నిత్యం పేలుళ్లు, కాల్పులతో సూడాన్ నగరాలు దద్దరిల్లుతున్నాయి.

నియంత ఒమర్ అల్ బషీర్ పతనమైన నాలుగేళ్ల తర్వాత, సైనిక తిరుగుబాటు తర్వాత రెండేళ్లకు కొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ మద్దతున్న ప్రణాళిక విషయంలో అసమ్మతే తాజా ఘర్షణలకు కారణం. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ ఘర్షణలకు దిగాయి.

Updated Date - 2023-04-24T18:38:43+05:30 IST