Javed Akhtar: పాక్‌ గడ్డపైనే.. ఆ దేశాన్ని దునుమాడిన జావేద్‌ అఖ్తర్‌

ABN , First Publish Date - 2023-02-22T02:39:17+05:30 IST

పాక్‌ గడ్డపై నుంచే ఆ దేశ ఉగ్రవాదంపై ధ్వజమెత్తారు ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అఖ్తర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుల విషయంలో పాక్‌ వ్యవహార శైలిపై, భారత కళాకారుల పట్ల పాక్‌ తీరుపై విరుచుకుపడ్డారు.

Javed Akhtar: పాక్‌ గడ్డపైనే.. ఆ దేశాన్ని దునుమాడిన జావేద్‌ అఖ్తర్‌

ముంబై ఉగ్రదాడులపై కుండబద్ధలు

కుట్రదారులు మీ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వ్యాఖ్య

లాహోర్‌, ఫిబ్రవరి 21: పాక్‌ గడ్డపై నుంచే ఆ దేశ ఉగ్రవాదంపై ధ్వజమెత్తారు ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అఖ్తర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుల విషయంలో పాక్‌ వ్యవహార శైలిపై, భారత కళాకారుల పట్ల పాక్‌ తీరుపై విరుచుకుపడ్డారు. ఆదివారం లాహోర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి అఖ్తర్‌ హాజరయ్యారు. ‘‘మేము ముంబైకి చెందిన వాళ్లం. 26/11 దాడులు కళ్లారా చూశాం. ఆ దుశ్చర్యకు పాల్పడిన వారు ఈజిప్టు నుంచో నార్వే నుంచో రాలేదు. ఆ కుట్రదారులు ఇంకా మీ దేశం(పాకిస్థాన్‌)లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కాబట్టి ఈ విషయంలో భారతీయుల్లో కోపం ఉండడం సహజం’’ అని ఓ ప్రేక్షకుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాక్‌ కళాకారులను భారత్‌ గౌరవించినట్లుగా, భారత కళాకారులను పాక్‌ గౌరవించడం లేదని జావేద్‌ విమర్శించారు.

పాకిస్థాన్‌ కళాకారులైన నుస్రత్‌ ఫతే అలీ ఖాన్‌, మెహదీ హసన్‌లకు భారత్‌లో ఘన స్వాగతం పలికి, సన్మాన కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేసుకుంటూ, లతా మంగేష్కర్‌కు మీ దగ్గర ఒక కార్యక్రమమైనా చేపట్టారా? అని నిలదీశారు. దాంతో ఒక్కసారిగా, ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత మోగింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జావేద్‌ పాక్‌ను కడిగేయడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దేశంలోని టీవీ చానెళ్లు ఉగ్రదాడుల ప్రసారంపై పాక్‌ తాజాగా నిషేధాన్ని విధించింది. ఘటనాస్థలాల్లో మీడియా అత్యుత్సాహం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది.

Updated Date - 2023-02-22T02:39:18+05:30 IST