J&K: సరిహద్దుల్లో విమానం తరహా బెలూన్ స్వాధీనం

ABN , First Publish Date - 2023-01-22T17:57:53+05:30 IST

జమ్మూకశ్మీర్‌‌లోని కౌర్ ఏరియాలో అనుమానాస్పద బెలూన్‌ను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌పై..

J&K: సరిహద్దుల్లో విమానం తరహా బెలూన్ స్వాధీనం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌‌లోని కౌర్ ఏరియాలో అనుమానాస్పద బెలూన్‌ను పోలీసులు ఆదివారంనాడు స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న ఈ బెలూన్‌పై 'పీఐఏ' (PIA) అని రాసి ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ని పీఐఏగా పిలుస్తుంటారు. గతంలో కూడా జమ్మూలోయలో ఈ తరహాలో పలు బెలూన్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, గత శనివారంనాడు నార్వాల్‌లో జంట కారు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్ తరహా బెలూన్ కనిపించడంతో పోలీసు యంత్రాంగం ఆరా తీస్తోంది.

కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కొనసాగుతుండటం, రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో నార్వాల్‌ లోని ట్రాన్స్‌పోర్ట్ యార్ట్‌లో వరుస పేలుళ్లు చోటుచేసుకోవడం శనివారం సంచలనమైంది. రిపైర్ల కోసం వర్క్‌షాప్‌కు పంపిన వాహనంలో ఉదయం 10.45 గంటలకు తొలి పేలుడు సంభవించిందని, మరో 15 నిమిషాలకు ఆ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద రెండో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షి జస్విందర్ సింగ్ తెలిపారు. తొలి పేలుడు ఘటనలో ఐదుగురు, రెండో పేలుడుకు మరో ఇద్దరు గాయపడ్డారు.

Updated Date - 2023-01-22T17:59:26+05:30 IST