RAHUL : కేజీ టు పీజీ ఉచిత విద్య
ABN , First Publish Date - 2023-10-29T06:27:22+05:30 IST
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరాల జల్లు కురిపించారు. మరోసారి తమకు అధికారం ఇస్తే అన్ని ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో ఉచిత విద్యను అందిస్తామన్నారు.
తునికాకు సేకరించేవారికి ఏటా రూ.4 వేలు: రాహుల్
రాయ్పూర్, అక్టోబరు28: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరాల జల్లు కురిపించారు. మరోసారి తమకు అధికారం ఇస్తే అన్ని ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లలో ఉచిత విద్యను అందిస్తామన్నారు. అదేవిధంగా తుని కాకు సేకరించేవారికి ఏటా రూ.4వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం కాంకేర్ జిల్లాలోని భానుప్రతా్పపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓబీసీల గురించి పదేపదే మాట్లాడే ప్రధాని మోదీ కుల గణన విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని చెప్పారు. ‘‘మరోసారి మమ్మల్ని ఆశీర్వదించండి.
ఈసారి అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ స్కూ ళ్లు, కాలేజీల్లో కేజీ టు పీజీ విద్యను ఉచితంగా అందిస్తాం’’ అని రాహుల్ హామీ ఇచ్చారు. బస్తర్ ప్రాంతంలో బలమైన గిరిజన సామాజిక వర్గాలు తునికాకు సేకరణపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వీరిని తమవైపు తిప్పుకొనేలా కాంగ్రెస్ ‘రాజీవ్గాంధీ ప్రోత్సాహక యోజన’ను ప్రకటించింది. ఈ పథకం కింద తునికాకు సేకరించేవారికి ఏటా రూ.4 వేల ఆర్థిక సాయం చేస్తామని రాహుల్ చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తల లబ్ధి కోసమే పనిచేస్తోందని, కానీ.. కాంగ్రెస్ రైతులు, దళితులు, కార్మికులు, ఆదివాసీల లబ్ధి కోసం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలనూ అధికారంలోకి రాగానే పూర్తి చేశామని రాహుల్ తెలిపారు. గిరిజనులను అవమానించడంలో బీజేపీని మించిన పార్టీ లేదన్నారు. ‘ఆదివాసీ’ పేరును ‘వనవాసీ’గా మార్చడంపై రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఆదివాసీల సంస్కృతి, చరిత్ర, భాషలపై దాడిచేయడమేనని చెప్పారు.