Manipur: ఆగని అల్లర్లు, కేంద్ర మంత్రికి మళ్లీ చేదు అనుభవం

ABN , First Publish Date - 2023-07-24T20:47:49+05:30 IST

మణిపూర్‌ లో రెండు నెలల క్రితం మొదలైన మొదలైన హింసాకాండకు తెర పడటం లేదు. శాంతియుత నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించడంతో సోమవారంనాడు ర్యాలీ నిర్వహించిన పలువురు మహిళలు కేంద్ర మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ నివాసం వద్దకు రాగానే కట్టుతప్పారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు.

Manipur: ఆగని అల్లర్లు, కేంద్ర మంత్రికి మళ్లీ చేదు అనుభవం

ఇంఫాల్: మణిపూర్‌ (Manipur)లో రెండు నెలల క్రితం మొదలైన మొదలైన హింసాకాండకు తెర పడటం లేదు. శాంతియుత నిరసన ప్రదర్శనకు పోలీసులు అనుమతించడంతో సోమవారంనాడు ర్యాలీ నిర్వహించిన పలువురు మహిళలు కేంద్ర మంత్రి ఆర్‌కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) నివాసం వద్దకు రాగానే కట్టుతప్పారు. ఆయన ఇంటిపై దాడికి దిగారు. రాళ్లు రువ్వారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆందోళనకు దిగిన మహిళలను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. గత రెండు నెలల్లో రంజన్ సింగ్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేయడం ఇది రెండోసారి.


మంత్రి ఇంటిపై దాడి జరిగినప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మణిపూర్‌లో తమ దుస్థితి గురించి పార్లమెంటులో మాట్లాడాలని, ఇంటర్నెట్ సర్వీస్ పునరుద్ధరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మంత్రి నివాసం వస్త గస్తీ ఉన్న భద్రతా సిబ్బంది సకాలంలో వారిని చెదరగొట్టారు. జాతుల (కుకీ, మెయితీ) మధ్య ఘర్షణలు ప్రారంభమైన మే 3వ తేదీన తొలిసారి మణిపూర్‌లో ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది.


కాగా, గత జూన్ 15న కూడా రంజన్ సింగ్ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగారు. రాళ్లు రువ్వడంతో పాటు ఇంటికి నిప్పుపెట్టారు. అయితే సకాలంలో భద్రతా సిబ్బంది, అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి. దీనిపై కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. తనను ఎన్నుకున్న ప్రజలే తన నివాసంపై దాడి చేయడం బాధాకరమని, సమస్యపై కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకు వెళ్తున్నానని చెప్పారు. దేవుడి దయ వల్ల దాడి సమయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడినట్టు తెలిపారు.

Updated Date - 2023-07-24T20:50:11+05:30 IST