Manipur: మణిపూర్‌లోకి మయన్మారీలు

ABN , First Publish Date - 2023-07-26T03:17:40+05:30 IST

జాతుల ఘర్షణతోనే అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో మరో సమస్య..! పొరుగు దేశం మయన్మార్‌(Myanmar) ప్రజలు రాష్ట్రంలోకి భారీగా చొరబడ్డారు.

 Manipur: మణిపూర్‌లోకి   మయన్మారీలు

2 రోజుల్లోనే 700 మందిపైగా రాక

ఖంపట్‌ నుంచి చందేల్‌ జిల్లాలోకి..

కుకీలకు మద్దతుగా మిజోరంలో ర్యాలీ

ఇంఫాల్‌, న్యూఢిల్లీ, జూలై 23: జాతుల ఘర్షణతోనే అట్టుడుకుతున్న మణిపూర్‌(Manipur)లో మరో సమస్య..! పొరుగు దేశం మయన్మార్‌(Myanmar) ప్రజలు రాష్ట్రంలోకి భారీగా చొరబడ్డారు. కేవలం రెండు రోజుల్లోనే 718 మంది మణిపూర్‌లోని చందేల్‌ జిల్లాకు వచ్చారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు భద్రతను పర్యవేక్షించే అసోం రైఫిల్స్‌ను నివేదిక కోరింది. వారిని వెనక్కు పంపించేయాలని ఆదేశించింది. ఇకపై ఎవరూ రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కాగా, మయన్మారీలు శని, ఆదివారాల్లో ఎలాంటి ప్రయాణ ధ్రువపత్రాలు లేకుండానే మణిపూర్‌లోకి వచ్చినట్లు సర్కారు గుర్తించింది. వారందరి బయోమెట్రిక్‌, ఫొటోలు తీసుకోవాలని చందేల్‌ యంత్రాంగానికి సూచించింది. మణిపూర్‌లోకి చొరబడినవారు పశ్చిమ మయన్మార్‌లోని ఖంపట్‌ పట్టణానికి చెందిన శరణార్థులుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఇండో-మయన్మార్‌ ఫ్రెండ్లీ రోడ్‌ మీదుగా 83 కిలోమీటర్ల దూరంలో చందేల్‌కు వచ్చారని హోం శాఖ తెలిపింది. కాగా, హింసకు ఆజ్యం పోస్తున్న ఫేక్‌ న్యూస్‌ కట్టడికి మణిపూర్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉండగా, 3 నెలల తర్వాత మణిపూర్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ను మంగళవారం పునరుద్ధరించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌పై మాత్రం నిషేధం కొనసాగుతోంది.

కుకీలకు మద్దతుగా మిజో పార్టీలు, ప్రజలు

మణిపూర్‌లోని కుకీలకు మద్దతుగా మిజోరంవ్యాప్తంగా మంగళవారం ర్యాలీలు నిర్వహించారు. సీఎం జొరామ్‌తంగ, మంత్రులు సహా అన్ని పార్టీల వారు ఇందులో పాల్గొనడం గమనార్హం. ఐదు కీలక ప్రజా సంఘాల సమ్మిళితమైన ఎన్‌జీవో కో ఆర్డినేషన్‌ కమిటీ ర్యాలీలు చేపట్టింది. మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-26T03:17:40+05:30 IST