కర్ణాటక ఎన్నికలయ్యాక పాట్నాలో విపక్షాల భేటీ!
ABN , First Publish Date - 2023-04-30T03:52:32+05:30 IST
లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతను చాటేలా తొలి సమావేశాన్ని బిహార్లో నిర్వహిస్తే బావుంటుందని ..
పాట్నా: దేశంలోని విపక్ష పార్టీల సమావేశానికి బిహార్ వేదిక కానుంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కీలక భేటీ జరగనుంది. 2024లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి సంబంధించిన చర్చలు సాగించేందుకు ఒక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నామని బిహార్ సీఎం నితీశ్ తెలిపారు. ప్రస్తుతం కొందరు నేతలు కర్ణాటక ఎన్నికలలో తీరిక లేకుండా ఉన్నారని అవి ముగిసిన తర్వాత విపక్షాల సమావేశానికి వేదికను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. అన్ని పార్టీల నేతలు పాట్నాలో ఆ సమావేశం నిర్వహించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే సంతోషంగా ఆ బాధ్యతను చేపడతామని నితీశ్ అన్నారు.
ఈ నెల 24న బెంగాల్ సీఎం మమతను కలిసిన సమయంలో కూడా లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాల ఐక్యతను చాటేలా తొలి సమావేశాన్ని బిహార్లో నిర్వహిస్తే బావుంటుందని వ్యాఖ్యానించారు. కాగా, నితీశ్ పగటి కలలు మానుకోవాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాని పదవి ఖాళీగా లేదని 2024లో మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఇది దేవెగౌడ, ఐకే గుజ్రాల్ కాలం కాదన్న విషయాన్ని నితీశ్ గుర్తించాలని ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉండగా, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్తో నితీశ్ భేటీ అయ్యారు. దాదాపు ఏడు నెలల తర్వాత సొంత ఊరికి వచ్చిన లాలూను ఆయన ఇంటికి వెళ్లి నితీశ్ పరామర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసిన నితీశ్ తాజాగా లాలూతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.