Share News

శబరిమలలో నిర్వహణ అస్తవ్యస్తం

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:28 AM

మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం అయ్యప్ప భక్తులు శబరియాత్రలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆది, సోమవారాల్లో ఏకంగా పంపాబే్‌సకు 20 కి.మీ. దూరంలో ఉన్న నీలక్కల్‌కు చేరడం కూడా భక్తులకు గగనంగా

శబరిమలలో నిర్వహణ అస్తవ్యస్తం

కేరళ సర్కారుపై మండిపడ్డ బీజేపీ, కాంగ్రెస్‌

కి.మీ. కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌లతో భక్తుల అగచాట్లు

హైకోర్టు చెప్పినా.. అన్నపానీయాలు కరువు

ముగిసిన మండల పూజలు.. ఆలయం బంద్‌

మునుపెన్నడూ లేనంతగా ఈ సంవత్సరం అయ్యప్ప భక్తులు శబరియాత్రలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆది, సోమవారాల్లో ఏకంగా పంపాబే్‌సకు 20 కి.మీ. దూరంలో ఉన్న నీలక్కల్‌కు చేరడం కూడా భక్తులకు గగనంగా మారింది. ఎరుమేలి, పథనంతిట్ట మార్గాల్లో కి.మీ.కొద్దీ దూరం వరకు అయ్యప్ప భక్తుల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆయా దృశ్యాలను టీవీ చానళ్లలో, వార్తాపత్రికల్లో చూసిన కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్‌ అనిల్‌ నరేంద్రన్‌ బెంచ్‌ ఏకంగా కేరళ సర్కారు, పోలీసులు, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు(టీడీబీ)ల తీరును తప్పుబట్టారు. ‘‘ట్రాఫిక్‌జామ్‌తో మార్గమధ్యంలోనే నిలిచిపోయి, అన్నపానీయాలు లేకుండా భక్తులు ఇక్కట్లపాలవుతున్నారు. వారికి భోజన సదుపాయాలు కల్పించాలి’’ అని ఆదేశాలు జారీచేశారు. అయితే ఆ దిశలో కేరళ సర్కారు చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ఆరోపించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ఏకంగా పంపాబే్‌సకు చేరుకుని, భక్తుల కష్టాలపై గ్రౌండ్‌ రిపోర్ట్‌ చేశారు. పంపా వద్ద ఇబ్బంది పడుతున్న వృద్ధులను ఇంటర్వ్యూ చేసి, ఆ వివరాలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కేరళ సర్కారు తీరును ఎండగట్టారు.

పంపా వద్దే భక్తుల నిలిపివేత

శబరిమలలో మండలపూజ సీజన్‌ బుధవారంతో ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం రాత్రి 11 గంటలకు అయ్యప్ప సన్నిధి తలుపులను మూసివేయాలి. అప్పటి వరకు భక్తులను అనుమతించాలి. ఏటా జరుగుతున్నదిదే. అయితే బుధవారం మాత్రం సాయంత్రం 7 గంటల నుంచి భక్తులను పంపావద్దే నిలిపివేశారు. ఆలయం మూసివేత వల్ల గురు, శుక్రవారాల్లో వారికి అయ్యప్పను దర్శించుకునే అవకాశం లేదు. ఈనెల 30న సాయంత్రం 5 గంటలకు మక్కరవిళక్కు సీజన్‌ సందర్భంగా అయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. అప్పటి వరకు పంపా వద్దే వీరంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మకరవిళక్కుకు రోజుకు 80 వేల మంది భక్తులకు ఆన్‌లైన్‌ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్‌ ప్రశాంత్‌ తెలిపారు. ఇప్పుడు పంపా వద్ద నిలిచిపోయిన భక్తులు వారికి తోడవ్వడంతో.. మళ్లీ రద్దీ తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శబరిమల మండల పూజ సీజన్‌లో మంగళవారం వరకు రూ.241.71 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు పీఎస్‌ ప్రశాంత్‌ వివరించారు. ఈ నెల 25 వరకు 31.43 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించకున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 28 , 2023 | 03:28 AM