Share News

Udhayanidhi Stalin: రాజకీయ లబ్ది కోసమే బీజేపీ డ్రామాలాడింది.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2023-10-13T20:13:09+05:30 IST

గతంలో ఒక కార్యక్రమంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు దీనిపై పెద్ద రాద్ధాంతమే..

Udhayanidhi Stalin: రాజకీయ లబ్ది కోసమే బీజేపీ డ్రామాలాడింది.. సనాతన ధర్మం వివాదంపై ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్

గతంలో ఒక కార్యక్రమంలో సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు దీనిపై పెద్ద రాద్ధాంతమే సృష్టించారు. ఆ వ్యాఖ్యలను విపక్షాల ‘ఇండియా’ కూటమికి ఆపాదిస్తూ.. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే ఆ కూటమి పని అంటూ ఒకటే ఆరోపణలు చేశారు. ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, విపక్షాలపై నిందలు మోపేందుకు బీజేపీ సాయశక్తులా ప్రయత్నించింది. ఇప్పుడు అందుకు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తన వ్యాఖ్యల్ని బీజేపీ వక్రీకరించిందని ఆయన ఆ పార్టీకి మొట్టికాయలు వేశారు.


ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023’ అనే ప్రత్యేక కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం బీజేపీ ‘సనాతన ధర్మం’పై నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించింది. ఉత్తర భారత మీడియా కూడా నా ప్రకటనని తప్పుగా ప్రెజెంట్ చేసింది’’ అని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు సంస్థలను దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. అటు.. మోదీ ప్రభుత్వం కేటాయించిన ఆయా గవర్నర్‌లు రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. దక్షిణ భారత రాష్ట్రాల హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు.

ఇదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ డీలిమిటేషన్ ప్రక్రియపై కూడా విరుచుకుపడ్డారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 8 అసెంబ్లీ సీట్లు తగ్గుతాయని.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకూ ఇలాంటి నష్టమే వాటిల్లుతుందని అన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియకు కేవలం రెండేళ్ల సమయమే మిగిలుందన్న ఆయన.. ఇందుకు వ్యతిరేకంగా మనం గళమెత్తాలని పిలుపునిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ‘తలపై వేలాడదీసిన కత్తి’గా అభివర్ణించారని.. ఇతర పార్టీలు సైతం దీనిని వ్యతిరేకిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-10-13T20:13:09+05:30 IST