FM Nirmala Sitharaman : ముస్లింలపై హింస ఓ భ్రమ

ABN , First Publish Date - 2023-04-12T03:00:56+05:30 IST

మైనారిటీల అంశాలపై భారత్‌ను నిందించేవారికి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిపై అసలు అవగాహనే లేదని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తేల్చిచెప్పారు. ముస్లింల జీవితాలను కష్టాల పాలు చేసి ఉంటే,

FM Nirmala Sitharaman : ముస్లింలపై హింస ఓ భ్రమ
Nirmala Sitharaman

అది భారత్‌పై పశ్చిమదేశాల ప్రతికూల భావన

ఆ రాతలే నిజమైతే వారి జనాభా పెరిగేదే కాదు

వాస్తవాలపై అవగాహన లేకే నిందలు: నిర్మల

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 11: మైనారిటీల అంశాలపై భారత్‌ను నిందించేవారికి క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిపై అసలు అవగాహనే లేదని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ తేల్చిచెప్పారు. ముస్లింల జీవితాలను కష్టాల పాలు చేసి ఉంటే, వారి జనాభా ఇంతగా పెరిగేది కాదన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె సోమవారం వాషింగ్టన్‌ డీసీలో పీటర్‌సన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ముస్లింలపై హింసకు సంబంధించి అడిగిన ఓ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘అది భారత్‌పై పశ్చిమదేశాలకు ఉన్న ప్రతికూల భావన’ అని కొట్టిపారేశారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండో దేశం భారత్‌ అని, దేశంలో ముస్లిం జనాభా మాత్రమే సంఖ్యాపరంగా పెరుగుతోందని చెప్పారు. ‘ఏ మాత్రం అవగాహన ఉన్నా, వాస్తవాలు తెలిసినా ఇలాంటి రాతలు రాయరు. ప్రభుత్వ మద్దతుతో ముస్లింల జీవితాలను దుర్భలం చేసినట్లయితే, వారి జనాభా 1947 సంవత్సరం నుంచి ఇంతగా పెరిగేది కాదు. దీనికి భిన్నంగా పాకిస్థాన్‌లో ముహాజిర్‌లు, షియాలు తదితర మైనారిటీలపై హింస కొనసాగుతోంది. అక్కడ మైనారిటీ ముస్లిం తెగలు కూడా అంతమవుతున్నాయి. భారత్‌లో ముస్లింలపై హింసకు పాల్పడుతున్నారనేది ఓ భ్రమ’ అన్నారు. భారత్‌లో శాంతిభద్రతలు అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని నిర్మల చెప్పారు. ‘ఆయా రాష్ట్రాల్లో ఎన్నికైన స్థానిక ప్రభుత్వాలే శాంతిభద్రతల అంశాలు చూసుకుంటాయి. ప్రతి రాష్ట్రం, అక్కడి పోలీసులు వేరు. దీన్ని బట్టే ఈ రాతలు రాసేవారికి భారత్‌లో శాంతిభద్రతల వ్యవస్థల గురించి అసలు అవగాహనే లేదని స్పష్టమవుతోంది. ఇలాంటి రాతలు రాసేవారిని భారత్‌కు ఆహ్వానిస్తున్నా. వారు భారత్‌కు వచ్చి ఆ రాతల్ని నిరూపించాలి’ అని నిర్మల సవాలు విసిరారు.

Updated Date - 2023-04-12T03:00:57+05:30 IST