Rice Bags NRIs: బియ్యం కోసం వెర్రెత్తిపోతున్న ఎన్నారైలు.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

ABN , First Publish Date - 2023-07-22T11:29:40+05:30 IST

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన అలా వెలువడిందో.. లేదో.. ఎన్నారైలు ఉలిక్కిపడ్డారు. అమెరికాలోని ఎన్నారైలు బియ్యం కోసం రైస్ స్టోర్స్ ముందు క్యూ కట్టారు. అగ్ర రాజ్యంలోని ఇండియన్ స్టోర్స్ వద్ద బియ్యం కోసం ఓ మినీ యుద్ధమే జరుగుతోంది.

Rice Bags NRIs: బియ్యం కోసం వెర్రెత్తిపోతున్న ఎన్నారైలు.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని రిటైల్‌ ధరలను అదుపులో ఉంచటానికి, దేశీయంగా సరఫరాను పెంచటానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన అలా వెలువడిందో.. లేదో.. ఎన్నారైలు ఉలిక్కిపడ్డారు. అమెరికాలోని ఎన్నారైలు బియ్యం కోసం రైస్ స్టోర్స్ ముందు క్యూ కట్టారు. అగ్ర రాజ్యంలోని ఇండియన్ స్టోర్స్ వద్ద బియ్యం కోసం ఓ మినీ యుద్ధమే జరుగుతోంది. ఇదే అదనుగా.. బియ్యం ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. కొన్ని స్టోర్స్ ముందు ధరలు పెరిగినట్లు బోర్డులు పెట్టి మరీ అమ్మేస్తున్నారు.


అమెరికాలో బియ్యం కోసం ఎన్నారైలు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని చోట్ల అయితే.. ‘మాకు కావాలంటే మాకు కావాలి’ అంటూ రైస్ బ్యాగ్స్ కోసం గొడవలు పడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. కొన్ని స్టోర్స్ ముందు ‘నో స్టాక్’ బోర్డులు కూడా కనిపిస్తున్నాయంటే బియ్యం కోసం అమెరికాలోని ఎన్నారైలు ఏరేంజ్‌లో ఎగబడ్డారో అర్థం చేసుకోవచ్చు. బియ్యం ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం ఎప్పుడు ఎత్తేస్తుందోనన్న భయంతో అవసరానికి మించి కూడా కొందరు ఎన్నారైలు బియ్యం కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. డల్లాస్‌లోని కాస్ట్కో స్టోర్స్ దగ్గర కనిపిస్తున్న భారీ క్యూలైన్లు ఎన్నారైల గాబరాకు అద్దం పట్టాయి. ఎన్నారైల పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని ఇళ్లు అమ్మే కంపెనీలైతే ఇల్లు కొంటే 15 రైస్ బ్యాగ్స్ ఫ్రీ అంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. D.R.HORTON అనే అమెరికా బిల్డర్ కంపెనీ ఈ ఆఫర్‌కు తెరలేపింది. ‘సోనా మసూరి బియ్యం దొరకడం లేదా..? మేం మీకు సాయం చేస్తాం’ అని ఇంటి కొనుగోలుపై 15 రైస్ బ్యాగ్స్ ఫ్రీ అని ప్రకటనలు కూడా ఇచ్చి ఎన్నారైలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఇదిలా ఉండగా.. భారత ప్రభుత్వం నాన్-బాసుమతి రైస్‌పై మాత్రమే నిషేధం విధించింది. ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యం ఎగుమతుల విధానంలో ఎటువంటి మార్పు లేదు. బియ్యం ఎగుమతుల్లో వీటిదే సింహభాగం కాగా, బాస్మతీయేతర తెల్లబియ్యం వాటా 25 శాతమే. థాయ్‌లాండ్‌, ఇటలీ, స్పెయిన్‌, శ్రీలంక, అమెరికాలకు ఇవి ఎక్కువగా వెళ్తుంటాయి. 2021-22లో 26.2 లక్షల డాలర్ల విలువైన బాస్మతీయేతర బియ్యం నిల్వలు ఎగుమతి కాగా, మరుసటి ఏడాది వాటి ఎగుమతుల విలువ 42 లక్షల డాలర్లకు పెరిగింది. ‘దేశీయ మార్కెట్లో బాస్మతీయేతర తెల్లబియ్యం ధరలు పెరుగుతున్నాయి. గత ఏడాది కాలంలో 11.5 శాతం మేర పెరుగగా, ఈ నెల రోజుల్లో మూడు శాతం పెరుగుదల నమోదైంది’ అని ఆహారశాఖ తెలిపింది.

‘ధరలను తగ్గించటానికి, మార్కెట్లో వాటి నిల్వలను పెంచటానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఎగుమతులపై 20 శాతం సుంకం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం వాటి ఎగుమతులు 33.66 లక్షల టన్నులు కాగా ఈ ఏడాది అవి 42.12 లక్షల టన్నులకు పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, వరి పండించే ఇతర దేశాల్లో ప్రతికూల వాతావరణం తదితర కారణాల వల్లే ఎగుమతులు పెరిగాయి’ అని ఆహారశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎగుమతులపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చిందని, దీనివల్ల దేశీయ మార్కెట్లో బియ్యం ధరలు తగ్గుతాయని తెలిపింది. ఉప్పుడు బియ్యం, బాస్మతీ బియ్యం ఎగుమతులు యథాతథంగా కొనసాగుతాయని పేర్కొంది.

Updated Date - 2023-07-22T11:30:24+05:30 IST