Man carries Mother corpse: తల్లి శవాన్ని దుప్పట్లో చుట్టి 40 కిలోమీటర్లు జర్నీ.. కారణం తెలిస్తే కంటతడే..!

ABN , First Publish Date - 2023-01-06T15:19:45+05:30 IST

అంధులైన తల్లిదండ్రులను కావిడలో ఉంచి భుజంపై మోసుకెళ్లిన శ్రవణ కుమార్‌ని తలపిస్తూ ఓ యువకుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నతల్లి శవాన్ని భుజంపై మోసుకుంటూ

Man carries Mother corpse: తల్లి శవాన్ని దుప్పట్లో చుట్టి 40 కిలోమీటర్లు జర్నీ.. కారణం తెలిస్తే  కంటతడే..!

న్యూఢిల్లీ: అంధులైన తల్లిదండ్రులను కావిడలో ఉంచి భుజంపై మోసుకెళ్లిన శ్రవణ కుమార్‌ని తలపిస్తూ ఓ యువకుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నతల్లి శవాన్ని భుజంపై మోసుకుంటూ కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగించిన హృదయ విదారక ఘటన పశ్చిమబెంగాల్‌ (West bengal)లోని జల్‌పాయ్‌గురి (Jalpaiguri) జిల్లాలో చోటుచేసుకుంది. కాలినడకతో రోడ్లపై తల్లి శవాన్ని తీసుకెళ్తున్న ఆ దృశ్యాన్ని చూసి కొందరు కంటతడి పెడితే, చాలాదూరం ప్రయాణం తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ ఆదుకుని ఉచిత అంబులెన్స్ సేవతో ఆ శవాన్ని ఇంటికి చేర్చింది. ఈ ఘటనపై బీజేపీ మండిపడింది. మమతా బెనర్జీ పాలనకు, కట్-మనీ కల్చర్‌‌కు ఈ ఘటన నిదర్శనమంటూ విమర్శలు గుప్పించింది.

సంఘటన వివరాల ప్రకారం, రామ్‌ప్రసాద్ దేవన్ అనే యువకుడు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 72 ఏళ్ల తల్లిని జల్‌పాయ్‌గురిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. ఆ మరుసటి రోజే ఆమె కన్నుమూసింది. ఆసుపత్రికి తీసుకు వచ్చేటప్పుడు రూ.900 తీసుకున్నారని, అయితే తల్లి శవాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు రూ.3000 డిమాండ్ చేశారని రామ్ ప్రసాద్ వాపోయాడు. అంత సొమ్ము తాము ఎక్కడి నుంచి తెచ్చేదంటూ కంటతడిపెట్టాడు. గత్యంతరం లేని పరిస్థితిలో తల్లి శవాన్ని దుప్పట్లో చుట్టి, భుజంపై పెట్టుకుని అతను ఇంటిముఖం పట్టాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి 40 కిలోమీటర్ల దూరం ఉండటంతో రామ్ ప్రసాద్ పెద్ద సోదరుడి సహాయం కూడా తీసుకున్నాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి అతనికి ఒక వాహనం ఏర్పాటు చేసింది. ఉచితంగా వారిని ఇంటివరకూ తీసుకువెళ్లింది.

ఆసుపత్రి వర్గాల స్పందన...

కాగా, ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెట్ కల్యాణ్ ఖాన్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని అన్నారు. తమకు తెలిసి ఉంటే ఒక వాహనం ఏర్పాటు చేసి ఉండేవారమని, ఆ విషయం ప్రసాద్ కుటుంబానికి తెలిసి ఉండకపోవచ్చని చెప్పారు. బాధిత కుటుంబీకులు తమను సంప్రదించలేదని, ఏ అవసరం ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా సహకరిస్తామని చెప్పారు.

స్వచ్ఛంద సంస్థ ఆరోపణ...

కాగా, రామ్ ప్రసాద్ దేవన్ తల్లి శవాన్ని ఇంటికి చేర్చిన సామాజిక సంస్థ ఆఫీసర్ బేరర్ మాట్లాడుతూ, ఉచిత సేవలు అందించేందుకు మందుకు వచ్చిన వారిని అంబెలెన్స్ ఆపరేటర్లు ఆసుపత్రి సమీపానికి కూడా రానీయడం లేదని చెప్పారు. అయితే, హెచ్చు చార్జీలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలను జిల్లా అంబులెన్స్ అసోసియేషన్ తోసిపుచ్చింది. రైలు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తమ సభ్యులు ఉచిత సేవలు అందిస్తున్నారని తెలిపారు.

మమత పాలనకు ఇదో మచ్చుతునక..

కాగా, ఈ ఘటనపై బీజేపీ జాతీయ సమాచార, సాంకేతిక శాఖ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు. ఇది మమతా బెనర్జీ తరహా పాలనకు నిదర్శనమని అన్నారు. కట్-మనీ సంస్కృతి ప్రతీ స్థాయిలోనూ ఉందని, రూ.3000 కంటే తక్కువ చార్జీకి వచ్చేది లేదని అంబులెన్స్ ఆపరేటర్లు డిమాండ్ చేయడంతో తల్లి శవాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు.

Updated Date - 2023-01-06T15:21:34+05:30 IST