India vs New Zealand: చివర్లో చితక్కొట్టేసిన మిచెల్.. భారత్ ఎదుట భారీ స్కోరు

ABN , First Publish Date - 2023-01-27T21:05:53+05:30 IST

భారత్‌(Team India)తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్(New Zealand)

India vs New Zealand: చివర్లో చితక్కొట్టేసిన మిచెల్.. భారత్ ఎదుట భారీ స్కోరు

రాంచీ: భారత్‌(Team India)తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్(New Zealand) భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి టీమిండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన కివీస్(Kiwis) ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. తొలి వికెట్‌కు ఫిన్ అలెన్, డెవోన్ కాన్వే కలిసి 43 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్దేశించింది.

23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన అలెన్‌(Finn Allen )ను ఐదో ఓవర్ రెండో బంతికి వాషింగ్టన్ సుందర్(Washington Sunder) బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్‌మన్‌ను కూడా సుందర్ అదే ఓవర్ చివరి బంతికి డకౌట్‌గా వెనక్కి పంపాడు. దీంతో 43 పరుగుల వద్ద వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన వికెట్ కీపర్ డెవోన్ కాన్వే మాత్రం బ్యాట్ ఝళిపించాడు.

35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ (52) పూర్తి చేసుకుని అర్షదీప్‌కు చిక్కాడు. గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేయగా, చివర్లో డరిల్ మిచెల్ రెచ్చిపోయాడు. అర్షదీప్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. తొలి బంతికి మిచెల్ సిక్సర్ బాదాడు. అది నోబాల్ కావడంతో ఫ్రీ హిట్ లభించింది. ఆ తర్వాత బంతికి కూడా సిక్సర్ బాదాడు. రెండో బంతికి సిక్సర్, మూడో బంతికి ఫోర్ బాదడంతో మూడు బంతుల్లో 23 పరుగులు లభించాయి.

నాలుగో బంతికి రన్ రాలేదు. చివరి రెండు బంతులకు నాలుగు పరుగులు వచ్చాయి. ఫలితంగా చివరి ఓవర్‌లో కివీస్‌కు 27 పరుగులు లభించాయి. దీంతో న్యూజిలాండ్ స్కోరు 176 పరుగుల వద్ద ఆగింది. 30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేసిన మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్‌కు రెండు వికెట్లు లభించాయి

Updated Date - 2023-01-27T21:05:55+05:30 IST