Telangana University: తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో వివాదం

ABN , First Publish Date - 2023-05-15T15:33:12+05:30 IST

తెలంగాణ వర్సిటీ (Telangana University)లో రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో వివాదం నెలకొంది. రిజిస్ట్రార్ ఛాంబర్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేసింది.

Telangana University: తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో వివాదం

హైదరాబాద్: తెలంగాణ వర్సిటీ (Telangana University)లో రిజిస్ట్రార్ కుర్చీ విషయంలో వివాదం నెలకొంది. రిజిస్ట్రార్ ఛాంబర్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేసింది. వీసీ రవీందర్ గుప్తా (VC Ravinder Gupta) రిజిస్ట్రార్ గదికి తాళం వేయించినట్లు సమాచారం. ఈసీ ఆదేశాలతో యాదగిరి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. యాదగిరి నియామకం చెల్లదంటూ వీసీ గుప్తా మరొకరిని నియమించారు. ఇటీవల ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ విద్యావర్ధినిని తొలగించి కొత్త రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమిస్తూ.. వీసీ గత ఏడాదిన్నర కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యయాలపై ఐదుగురు సభ్యుల కమిటీతో విచారించాలని వర్సిటీ పాలకమండలి తీర్మానించింది.

ఈ క్రమంలోనే వీసీ రవీందర్ గుప్తా హైకోర్టు (High Court)ను ఆశ్రయించడంతో ఈసీ తీర్మానాన్ని నిలిపేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర సర్కారుతో పాటు పాలకమండలి, రిజిస్ట్రార్‌ యాదగిరికి నోటీసులు ఇచ్చింది. అయితే ఏప్రిల్ 19న జరిగిన 55వ పాలకమండలి భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రొఫెసర్ యాదగిరి రిజిస్ట్రార్‌ హోదాలో కొనసాగలేక పోయారు. మే 5న జరిగిన సమావేశంలో తిరిగి ఆయన్నే రిజిస్ట్రార్‌‌గా నియమించారు.

Updated Date - 2023-05-15T15:33:12+05:30 IST