Delhi Liquor Scam: మరో 3 రోజులపాటు పిళ్లై కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ

ABN , First Publish Date - 2023-03-13T15:45:28+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైను మరో 3 రోజులపాటు పిళ్లై కస్టడీ పొడిగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది...

Delhi Liquor Scam:  మరో 3 రోజులపాటు పిళ్లై కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam)లో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లైను మరో 3 రోజులపాటు పిళ్లై కస్టడీ పొడిగించాలని సీబీఐ ప్రత్యేక కోర్టును ఈడీ కోరింది. సౌత్గ్రూప్ (Southgroup) లోని వ్యక్తులను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు బుచ్చిబాబును మార్చి 9న ఈడీ విచారణకూ రావాలని కోరామని ఈడీ కోర్టుకు తెలిపింది. బుచ్చిబాబు మార్చి 13 వరకు సమయం కోరారని, బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైని విచారించాల్సి ఉందని కోర్టు దృష్టికి ఈడీ అధికారులు తెలిపారు. అందువల్ల పిళ్ళై కస్టడీని మార్చి 15 వరకు పొడిగించాలని ఈడీ కోరింది. ఈ కేసులో అరెస్టయిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai)ని వారం రోజుల ఈడీ కస్టడీ నేటితో (సోమవారం) ముగియనుంది. అరుణ్‌పిళ్లైని వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే పాల్‌ ఈ నెల 7న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను శనివారం విచారించిన ఈడీ అధికారులు.. 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆమెను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పిళ్లై కస్డడీ పొడిగింపును ఈడీ కోరినట్లు తెలుస్తోంది. అలాగే, ఈడీ తన వద్ద బలవంతంగా తీసుకున్న వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిళ్లై సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరుణ్ పిళ్ళై‌కి చెందిన వట్టినాగులాపల్లిలో రూ .2.2 కోట్ల విలువైన భూమిని కూడా ఈడీ జప్తు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రామచంద్ర పిళ్లైతో కలిపి ఇప్పటి వరకూ 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఢిల్లీ మద్యంకుంభకోణంలో ఈడీ నిందితుడిగా పేర్కొంది. పలు దఫాలుగా రామచంద్ర పిళ్లై ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన మీదట దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లలో అరుణ్ రామచంద్ర పిళ్లై పేరు కూడా ఉంది. ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్టైన వారిలో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. అరుణ్ పిళ్ళై.. ఈ స్కామ్‌లో అభిషేక్ బోయిన్‌పల్లి, సమీర్ మహేంద్రూ, విజయ్ నాయర్ తదితరులకు రామచంద్ర పిళ్లై సహకరించారని ఈడీ భావిస్తోంది.

Updated Date - 2023-03-13T15:45:28+05:30 IST