Etala Rajender: చర్చకు సిద్ధమా?
ABN , First Publish Date - 2023-04-22T03:10:07+05:30 IST
సింగరేణిపై చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్కు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరించి ముందుకు రాకపోతే మరో సారి ఈ అంశంపై మాట్లాడే హక్కు బీఆర్ఎ్సకు లేదని స్పష్టం చేశారు.
సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తోంది రాష్ట్రమా? కేంద్రమా?
సీఎం కేసీఆర్కు బీజేపీ నేత ఈటల సవాల్
కేంద్రం, బీజేపీపై బీఆర్ఎస్ విషం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ డ్రామాలు
తొలుత టీఎస్ఆర్టీసీని కాపాడండి.. మునుగోడులో కాంగ్రెస్కు 25కోట్లు ఇవ్వలేదా?
ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు ఖాయం: ఈటల రాజేందర్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సింగరేణిపై చర్చకు సిద్ధమా? అని సీఎం కేసీఆర్కు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరించి ముందుకు రాకపోతే మరో సారి ఈ అంశంపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఈటల మీడియాతో మాట్లాడారు. కేంద్రం, బీజేపీపై సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పాడిందే పాట అన్నట్టు పదే పదే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరిస్తోందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీ రామగుండంలో చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు సింగరేణిలో 63 వేల మంది పర్మినెంట్ కార్మికులు ఉంటే.. ఇప్పుడు 43వేల మందికి తగ్గిపోయారు. అప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు 20వేల మంది ఉంటే ఇప్పుడు 30 వేలకు పెరిగారు. ఎవరు ప్రైవేట్పరం చేస్తున్నదెవరో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఒకప్పుడు మట్టిపని మాత్రమే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే వారు.. ఇప్పుడు బొగ్గు వెలికితీత పనులనూ అప్పగించడం నిజం కాదా?’’ అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటానని నాలుగు రోజులపాటు డ్రామాలు ఆడిన కేసీఆర్.. టెండర్లు ఎందుకు వెయ్యలేదని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు... ముందుగా టీఎస్ ఆర్టీసీని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీలో 9 వేల బస్సులు ఉండగా, ఇప్పుడు 4వేలు ఎందుకు అయ్యాయో వెల్లడించాలని డిమాడ్ చేశారు. కేసీఆర్కు వాస్తవాలు, పోరాటాలు.. అంటే పడవని ఈటల విమర్శించారు.
కాంగ్రెస్కు రూ. 25కోట్లు ఇచ్చింది నిజం కాదా?
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్కు రూ.25కోట్లు పంపించింది నిజం కాదా? ఇది వాస్తవం కాదని గుండెపై చేయి వేసుకుని బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా? అని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ‘‘దీనికేమైనా లెక్కలు ఉంటాయా? ఆధారాలుంటాయా? డబ్బులిస్తేనే పోలింగ్ బూత్కు వెళతామని ప్రజలే స్పష్టం చేయడం ఎంత అవమానకరం? ఇదీ ప్రజాస్వామ్యం... హుజురాబాద్లో బీఆర్ఎస్ రూ.6వేల కోట్లు ఖర్చుచేస్తే ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోయింది. బీఆర్ఎస్ డబ్బు పంపిణీకి హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలే పరాకాష్ఠ’’ అని వ్యాఖ్యానిరచారు. దేశంలో కాంగ్రె్సను ఎవరేమన్నా ముందుగా స్పందించేది సీఎం కేసీఆర్, ఆయన మంత్రులేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రె్సలు నాణేనికి బొమ్మా, బొరుసు అని, వచ్చే ఎన్నికల్లో వాటి మధ్య పొత్తు ఖాయమని తేల్చిచెప్పారు.