Srinagar Colony Temple: సెలబ్రిటీలకు ఎర్ర తివాచీ.. సామాన్య భక్తులు గాలికి!.. వెంకటేశ్వర... ఇవేమి సేవలయ్య!!

ABN , First Publish Date - 2023-01-02T19:12:01+05:30 IST

‘ఏడు కొండలవాడా, వేంకట రమణ గోవిందా’ అని అంటే చాలు శ్రీనగర్‌ కాలనీలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని లక్షలాది భక్తులకు నమ్మకం.

Srinagar Colony Temple: సెలబ్రిటీలకు ఎర్ర తివాచీ.. సామాన్య భక్తులు గాలికి!.. వెంకటేశ్వర... ఇవేమి సేవలయ్య!!

హైదరాబాద్: ‘ఏడు కొండలవాడా, వేంకట రమణ గోవిందా’ అని అంటే చాలు శ్రీనగర్‌ కాలనీలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని లక్షలాది భక్తులకు నమ్మకం. శ్రీనగర్‌ కాలనీలో స్వయంభుగా వెలసిన శ్రీనివాసుడు కోరి కొలిస్తే కొంగు బంగారమై కోరికలు తీరుస్తాడని ఆ ప్రాంతవాసుల విశ్వాసం. ఈ దేవాలయంలో సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారు చందనం, డ్రై ఫ్రూట్స్‌ అలంకారంలో దర్శనమిచ్చారు. అభయహస్తంతో కరుణించే స్వామి మనోహర రూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఇదంతా బాగానే ఉంది. కానీ దర్శనం కోసం తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులకు సరైన దర్శనం దొరకకపోగా నానా ఇక్కట్లు పడ్డారు. దీనికి కారణం దేవాలయ సిబ్బంది తీరు. వారం రోజులుగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం అని ప్రచారం చేసిన సిబ్బంది భక్తులకు చుక్కలు చూపించారు.

temple.jpg

ఉచిత దర్శనం కోసం బారులు తీరిన భక్తులకు కనీస వసతులు కల్పించలేదు. వీఐపీలకు మాత్రం ప్రత్యేక ట్రీట్‌మెంట్‌‌తో సేవలు చేశారు. సాధారణ భక్తులతో తమకు సంబంధమే లేదన్నట్లు వ్యవహరించారు. దీంతో రూ.100 ప్రత్యేక దర్శనం టికెట్‌ కొనుగోలు చేసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ దర్శనానికి, శీఘ్ర దర్శనానికి తేడా ఏదంటూ మండిపడ్డారు. చలికాలం అయినా సోమవారం ఎండ తీవ్రత కాస్త ఎక్కువ ఉండడంతో క్యూ లైన్‌లో పలువురు భక్తులు కళ్లు తిరిగి పడిపోయారు. వారికి మంచి నీరు అందించే వారు కూడా లేకుండా పోయారు. దర్శనం పూర్తయిన కొందరు భక్తులు తోటి భక్తులు క్యూ లైన్‌లో పడుతున్న ఇబ్బందులు చూడలేక స్వచ్ఛందగా తమ సొంత డబ్బుతో వాటర్‌ బాటిల్స్‌ కొనుగోలు చేసి పంపిణీ చేశారు. క్యూ లైన్‌లను పద్దతిగా నడిపించారు.

సెలబ్రిటీలే మాకు ముఖ్యం...

‘సెలబ్రిటీలు, బడా బాబులే మా దేవాలయానికి ముఖ్యం.. సాధారణ భక్తుల తిప్పలతో మాకు సంబంధం లేదు అన్నట్లు ఉంది’ శ్రీనగర్‌ కాలనీ వేంకటేశ్వరస్వామి దేవాలయ సిబ్బంది తీరు. సెలబ్రిటీ ఎవరైనా దేవాలయం గడప ముందు కనిపిస్తే చాలు.. ఎర్ర తివాచీ పరిచి ప్రత్యేక దర్శనం, మంగళశాసనాలు, ప్రసాదాలు ఇచ్చి శాలువాతో సత్కరించి సాగనంపుతున్నారు. సాధారణ భక్తుడి చేతిలో ఒక పువ్వు పెట్టి, అక్షంతలు వేసిన పాపాన పోలేదు. అయితే ఈ సెలబ్రిటీల్లో చాలామంది దేవాలయానికి భారీగా విరాళాలు సమకూర్చే భక్తులే కావచ్చు. కానీ దేవాలయానికి సాధారణ భక్తులు కూడా అవసరమేనన్న విషయాన్ని మరిచిపోయారు. అంతకన్నా ముందు భగవంతుడి ముందు అందరూ సామాన్యులేనన్న విషయాన్ని పక్కన పడేశారు.

ప్రసాదం పంపిణీలోనూ పులిహోరే..

temple1.jpg

‘‘భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్యూ లైన్‌ దగ్గర తాగునీటి వసతి, ప్రసాదం ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేస్తున్నాం’’ అని ఉత్సవానికి రెండ్రోజుల ముందు ఆలయ ఈవో లావణ్య చెప్పిన మాటలివి. కానీ అక్కడ పరిస్థితి మరోలా ఉంది. ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశికి భారీగా భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు. ఆ ఒక్క రోజులోనే ప్రత్యేక దర్శనం, లడ్డు, పులిహోర, వడ, అన్నదానంచ గోగ్రాసం ఇలా విరాళాల పేర లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ గంటల తరబడి క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు కనీస వసతులు మాత్రం ఏర్పాటు చేయరు. ప్రతి ఏడాది విక్రయాల కోసం పులిహోర లడ్డు ప్రసాదం ఉంటుంది. దేవాలయం నిర్ణయించిన రేట్లకు వాటిని విక్రయిస్తారు. ఉచిత ప్రసాదంగా కొన్నేళ్లగా పులిహోర పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఉచిత ప్రసాదంగా శనగలు సమర్పించారు. కరోనాకు ముందు క్యూ లైన్‌లో భక్తుల దాహార్తి కోసం మజ్జిగ, మంచినీళ్లు అందించేవారు. ఈసారి ఆ ఏర్పాటు లేకపోగా.. కనీసం క్యూ లైన్ల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్నే మర్చిపోయారు.

‘‘రూ. వంద రూపాయల టికెట్‌ ఏ పర్పస్‌తో పెట్టారు. త్వరగా దర్శనం చేసుకోవాలనే కదా? టికెట్‌ తీసుకుని లోపలికి వెళ్లగానే జనరల్‌ లైన్‌లో కలిపేశారు. ఇక వంద రూపాయల టికెట్‌ ఎందుకు?’’ అంటూ చింతల్‌ బస్తీ నుంచి స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తుడు ఎం. బాలాజీ మండిపడ్డారు. ‘‘కావలసిన వారికి, ధనికులకు దొడ్డిదారి గుండా ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేసి, సన్మానాలు చేసి పంపుతున్నారు. సామాన్య భక్తుడు ఏం పాపం చేశాడు?’’ అంటూ ఎండలో కళ్లు తిరిగి పడిపోయిన ప్రణవి అనే సాఫ్ట్‌వేర్‌ మహిళ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని కొందరు భక్తులు ఈవోని ప్రశ్నించడానికి వెళ్లగా నిర్లక్షంగా సమాధానం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘దేవుడు అందరివాడు. కానీ ఇక్కడ కొందరు సిబ్బంది మాత్రం సెలబ్రిటీలే ముఖ్యం. సామాన్యుడు భక్తుడు కాదా? వారు ఇచ్చేది విరాళం కాదా? దేవుడి ఆలయంలో పేద, ధనిక అనే వివక్ష ఎందుకు?’’ అని ఎల్‌.ఎన్‌ నగర్‌కు చెందిన రామారావు (వ్యాపారి) ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-03T14:19:56+05:30 IST