Journalism: లోకహితం కాంక్షించే పాత్రికేయుడు నారదుడు

ABN , First Publish Date - 2023-04-30T21:15:44+05:30 IST

సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తిని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని

Journalism: లోకహితం కాంక్షించే పాత్రికేయుడు నారదుడు
Samachara Bharathi

హైదరాబాద్: నారద మహర్షి గురించి అపోహలు ప్రచారంలో ఉన్నాయని, వాస్తవానికి లోకహితం కాంక్షించే అసలైన పాత్రికేయుడు నారదుడేనని జాతీయ పత్రిక 'ఆర్గనైజర్' సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్ అభిప్రాయపడ్డారు. 1826వ సంవత్సరంలోనే కోల్‌కతాలో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక 'నారద మహర్షి' ముఖచిత్రంతో ప్రచురితమైందని వెల్లడించారు.‌ ఆ తర్వాత నారద మహర్షిని పత్రికా రంగ ఆద్యునిగా గుర్తించాల్సి ఉన్నప్పటికీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కనుమరుగు చేశారని కేత్కర్ అభిప్రాయపడ్డారు. పాత్రికేయులు నారద సూత్రాలలోని 75, 76, 77వ సూత్రాలను ఆదర్శంగా తీసుకొని సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తిని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. సమాచారభారతి ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన "తొట్ట తొలి ఆదర్శనీయ పాత్రికేయుడు" నారద మహర్షి జయంతి కార్యక్రమంలో ప్రఫుల్ల కేత్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరిగాయి. రెడ్ హిల్స్‌లోని FTCCI ఆడిటోరియంలో లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయుల సమక్షంలో నారద జయంతి వేడుక వైభవోపేతంగా జరిగింది. పాత్రికేయులు సమాచారాన్ని అందించేటప్పుడు, వార్తలు రిపోర్ట్ చేసేటప్పుడు లోకహితాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ప్రఫుల్ల కేత్కర్ సూచించారు సమాజ శ్రేయస్సుతో అందించే వార్తలే నాణ్యతతో నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

సమాచారభారతి ఆవిర్భావం ఎందుకు జరిగింది, జాతీయ భావ ఆలోచనా స్రవంతిని నిలబెట్టాల్సిన అవసరం గురించి సమాచారభారతి అధ్యక్షులు డా. జి గోపాలరెడ్డి వివరించారు. యువ పాత్రికేయులకు విలువలతో కూడిన పాత్రికేయతపై తర్ఫీదు ఇవ్వటం, సామాజిక మాధ్యమంలో పనిచేస్తున్న పౌర పాత్రికేయుల సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు సమాచారభారతి నిర్వహిస్తోందని తెలిపారు.

"వడ్లమూడి స్మారక పురస్కారం" సీనియర్ పాత్రికేయులు రమా విశ్వనాథన్‌కి,' భండారు సదాశివరావు స్మారక' పురస్కారం సీనియర్ పాత్రికేయులు సామవేదం జానకీరామ్‌కి, 'సమాచారభారతి కాలమిస్ట్' పురస్కారం శ్యామసుందర్ వరయోగికి, 'సమాచారభారతి యువపురస్కారం' యువ పాత్రికేయులు కొంటు మల్లేశంకి ఇవ్వడం జరిగింది. సమాచార భారతి కార్యదర్శి నడింపల్లి ఆయుష్ సారధ్యంలో సమాచార భారతి సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకొన్నారు.

Updated Date - 2023-04-30T21:16:12+05:30 IST