Congress Manifesto: ఏడో గ్యారంటీకి కాంగ్రెస్ ప్లాన్! తెల్లకార్డుదారులందరికీ..!

ABN , First Publish Date - 2023-10-04T03:27:59+05:30 IST

బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్‌ బంధం అని, ఆ విషయాన్ని నిజామాబాద్‌ సభ సాక్షిగా ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని..

Congress Manifesto: ఏడో గ్యారంటీకి కాంగ్రెస్ ప్లాన్! తెల్లకార్డుదారులందరికీ..!

  • మోదీ, కేసీఆర్‌ చీకటి మిత్రులు

  • బీజేపీ, బీఆర్‌ఎ్‌స పార్టీలది ఫెవికాల్‌ బంధం

  • మోదీ దాన్ని మరోమారు స్పష్టం చేశారు: రేవంత్‌

  • ప్రజలు బైబై కేసీఆర్‌ అనే టైమొచ్చింది: ఠాకూర్‌

  • తెల్ల కార్డుకు సన్నబియ్యం.. కాంగ్రెస్‌ మరో హామీ

  • బీఆర్‌ఎస్‌.. బీజేపీ రిష్తేదార్‌ సమితి గతంలోనే చెప్పాను.. ఇప్పుడు మోదీ అంగీకరించారు బీజేపీ, బీఆర్‌ఎ్‌సది ఫెవికాల్‌ బంధం!

  • మోదీ దాన్ని మరోమారు స్పష్టం చేశారు .. వారిది ఢిల్లీలో దోస్తీ.. గల్లిలో కుస్తీ: రేవంత్‌

హైదరాబాద్‌, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య ఉన్నది ఫెవికాల్‌ బంధం అని, ఆ విషయాన్ని నిజామాబాద్‌ సభ సాక్షిగా ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అని.. మోదీ, కేసీఆర్‌ చీకటి మిత్రులని తాము మొదటి నుంచీ చెబుతున్నామని.. అదే నిజమని ఇప్పుడు మోదీ మాటలతో సుస్పష్టంగా తేలిందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని., బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల బంధాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘ కేసీఆర్‌ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం. మోదీ ఆశీస్సులతో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకున్నదీ నిజం. అలాగే ఇప్పటికీ మోదీ, కేసీఆర్‌ చీకటి మిత్రులేనన్నదీ పచ్చి నిజం’’ అని వ్యాఖ్యానించారు. నిజం నిప్పులాంటిదని, ఎప్పటికైనా నిగ్గు తేలక మానదని అన్నారు. గత తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్‌ మద్దతు ఉందన్న సంగతి.. పార్లమెంట్‌ రికార్డులే చెబుతాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి చీకట్లో మోదీతో ఏమేం లాలూచీలు పడ్డారో స్వయంగా మోదీనే చెప్పిన తర్వాత వారిద్దరి బంధం.. అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదని చెప్పారు. తెలంగాణ సమాజం జాగురుకతతో ఉండి...ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి, వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బై బై చెప్పాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్‌ ఎంపీ, ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్‌ పేర్కొన్నారు. ‘‘ఒకటి.. మోదీతో అలయన్స్‌ను కేసీఆర్‌ కోరుకుంటున్నరు. రెండు.. కేటీఆర్‌ను సీఎం చేయాలనుకున్నరు. ఇది గత రెండేళ్ల నుంచీ నా కొలీగ్‌ రేవంత్‌రెడ్డి చెబుతూనే ఉన్నడు’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారంనాడు ఆయన ట్వీట్‌ చేశారు.

రేషన్‌ కార్డుకు సన్నబియ్యం

ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటనతో అసెంబ్లీ ఎన్నికల రేసును హీటెక్కించిన కాంగ్రెస్‌ పార్టీ మరో ప్రజాకర్షక పథకాన్ని ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చాక రేషన్‌ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం సరఫరా చేస్తామన్న హామీని మేనిఫేస్టోలో చేర్చాలని నిర్ణయించింది. సన్నబియ్యంతో పాటు రేషన్‌ షాపుల ద్వారా వివిధ రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేయాని నిర్ణయించింది. గాంధీభవన్‌లో మంగళవారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌ బాబు అధ్యక్షతన ఆ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కమిటీ.. ఈ మేరకు నిర్ణయాలు చేసింది.

1revanth.jpg

బీసీ జనగణన చేపట్టండి: రేవంత్‌

బిహార్‌లో మాదిరిగా తెలంగాణలో కూడా బీసీ జనగణన చేపట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కాలంటే బీసీ జనగణనతోనే సాధ్యమవుతుందన్నారు. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెబుతున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. చేసింది మాత్రం శూన్యమన్నారు. రాజకీయంగానూ బీసీలకు కేవలం 20 సీట్లు మాత్రమే ఇచ్చి అణగదొక్కే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-10-04T11:37:06+05:30 IST