సింగరేణిని ప్రైవేట్పరం చేసిందే కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-11-27T23:42:37+05:30 IST
సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని, యూపీఏ హయాంలో బొగ్గు కుంభకోణాలు ఎన్ని జరిగాయో అందరికి తెలుసునని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు.
గోదావరిఖని, నవంబరు 27: సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అని, యూపీఏ హయాంలో బొగ్గు కుంభకోణాలు ఎన్ని జరిగాయో అందరికి తెలుసునని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు. బీజేపీ బొగ్గు బ్లాకులను టెండర్ ప్రక్రియ ద్వారా కేటాయించాలని ప్రతిపాదన చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీనేనని చందర్ అన్నారు. సోమవారం జీడీకే 11ఇంక్లైన్ ఆవరణలో జరిగిన కార్మికుల సమావేశంలో మాట్లాడారు. 55ఏళ్లు దుర్మార్గమైన పాలన చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. తాము తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తే రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ ఉద్యమం సమయంలో వైఎస్ జగన్ పక్షాన చేసి మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు వేశాడని చందర్ ఆరోపించారు. రెండు సంవత్సరాల పాటు కరోనాతో కష్టాలు పడ్డామని, కరోనా కాలంలో కూడా తాను ప్రజలతోనే కలిసి ఉన్నానని, ప్రజలతో పాటే సేవ చేస్తూ వచ్చానన్నారు. రామగుండాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చానని, మెడికల్ కళాశాల, ఇండస్ర్టియల్ పార్కు, ఐటీ పార్కు, సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్, కోర్టు భవనాలు మంజూరు చేయించామని చందర్ చెప్పారు. తాను కూడా సింగరేణి బిడ్డనేనని, తనను మరోకసారి ఆశీర్వదించాలని కోరారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే మల్లయ్య, నాయకులు నూనె కొమురయ్య, జావిద్పాషా, దేవ వెంకటేష్, గోపు ఐలయ్యయాదవ్, కనకం శ్యాంసన్, మండ రమేష్, పుట్ట రమేష్, అల్లం ఐలయ్య పాల్గొన్నారు.