మొక్కజొన్న కొనుగోళ్లకు పచ్చజెండా

ABN , First Publish Date - 2023-04-29T23:44:39+05:30 IST

మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా పంట సేకరించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు.

మొక్కజొన్న కొనుగోళ్లకు పచ్చజెండా

- జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు

- మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోనే సేకరణ

- జిల్లాలో సుమారు 5.80 లక్షల క్వింటాళ్ల సేకరణ అంచనా

జగిత్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా పంట సేకరించాలని సీఎం కేసీఆర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కేంద్రాలు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం కొంటే మద్దతు ధర కింటాలుకు రూ.1,962 మేర దక్కనుంది. జిల్లాలో ఇప్పటికే సింహభాగం పంటను రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మకున్నారు. గత రెండేళ్లుగా కొనేందుకు మార్క్‌ఫైడ్‌ ముందుకు రాకపోవడంతో ప్రస్తుత సీజన్‌లోనూ అదే పరిస్థితి ఉంటుందని భావించిన రైతులు వచ్చిన ధరలకు వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో ఉన్న కాస్త పంటను కూడా ఎంతో కొంతకు వ్యాపారులకు ఇచ్చేశారు. కొంటామనే భరోసా ముందే ఇస్తే తక్కువ ధరకు అమ్ముకునే వారం కాదని రైతులు వాపోతున్నారు.

జిల్లాలో మొక్కజొన్న సాగు ఇలా..

జగిత్యాల జిల్లాలో సూమారు 30 వేల ఎకరాల్లో రైతులు మక్క సాగు చేశారు. ఎకరాకు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మొగి పురుగు, కత్తెర పురుగు తదితర తెగుళ్ల నివారణకు, పందులు, కోతుల బారి నుంచి పంట రక్షణకు కంచె అమర్చినందుకు అదనంగా వెచ్చించారు. ఆరుగాలం కష్టించి పంటను కాపాడుకున్నా దిగుబడి తగ్గింది. వచ్చిన కొద్డిపాటి పంటను విక్రయించుకుందామంటే గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దళారులు, పౌలీ్ట్ర నిర్వాహకులు ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేశారు. పైగా తూకం, చెల్లింపుల్లోను మోసాలకు పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత లేకపోవడంతో కొందరు రైతులు త్వరగానే అమ్ముకోవాల్సి వచ్చింది. మరికొందరు గిట్టుబాటు ధర కోసం వేచి చూస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఇంకొందరు ఉన్న కాస్త పంటను అమ్ముకున్నారు.

ప్రయివేటు మార్కెట్‌లో తగ్గిన ధర

గత వానాకాలంలో క్వింటాలు మొక్కజొన్న రూ. 2 వేలకు పైగా పలికిన ధర ఈసారి రూ. 1800కే పరిమితమైంది. సర్కారు ముందే కొనుగోలు కేంద్రాలు తెరిస్తే మద్దతు ధర రూ. 1,962 లభించేది. వ్యాపారులు అటు ఇటుగా రూ. 1900 ఇచ్చేవారు. ఎకరా దిగుబడి సగటున 23 క్వింటాళ్లు అనుకున్నా సుమారు 6.90 లక్షల క్వింటళ్ల పంట వస్తుంది. ఇందులో అమ్ముకున్న సగం పంటకి లెక్కకట్టినా నష్టం అంచనా క్వింటాలుకు రూ. 150 సూమారు రూ. 5.17 కోట్ల వరకు జిల్లా రైతుల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది.

ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే చేతికి

జిల్లాలో పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మొక్కజొన్న పంట చేతికొచ్చింది. మొక్కజొన్నను ప్రధానంగా మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, ధర్మపురి, బుగ్గారం, బీర్‌పూర్‌, గొల్లపల్లి తదితర మండలాల్లో సాగు చేశారు. రెండో పంట అక్టోబరు చివరి వారం నుంచి నవంబరులో ముందస్తుగా వేస్తారు. పంట దాదాపుగా ఫిబ్రవరి, మార్చి మాసం వరకే చేతికి వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో సగానికి పైగా పంటను రైతులు ఇప్పటికే విక్రయించేశారు.

జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ మొక్కజొన్న కేంద్రాలను తెరవనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తులను అధికారులు పూర్తి చేశారు. జిల్లాలోని ధర్మపురి, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల, జగిత్యాల, మేడిపల్లి, బీర్‌పూర్‌, రాయికల్‌ ప్రాంతాల్లో మొక్కజొన్న కేంద్రాలను అధికారులు తెరవనున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాను వాతావరణ పరిశోధన కేంద్రం గ్రీన్‌ జోన్‌గా ప్రకటించడం, వర్షాలు కురిసే అవకాశాలుండడంతో కేంద్రాలను తెరవడానికి అధికారులు వేచిచూస్తున్నారు. సేకరించిన మొక్కజొన్నకు అవసరమైన గన్నీ బ్యాగులు, గోదాంలను సైతం అధికారులు సిద్దం చేశారు. జిల్లాలో రెండు, మూడు రోజుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవనున్నారు.

వాతావరణం అనుకూలించగానే తెరుస్తాం

- దివ్యభారతి, మార్క్‌ఫెడ్‌ డీఎం

మొక్కజొన్న కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాల వచ్చాయి. వాతావరణం సరిగా లేనందున ఇప్పటివరకు ప్రారంభించలేదు. జిల్లాలో తొమ్మిది కేంద్రాలను తెరవడానికి నిర్ణయించాము. రైతులకు మద్దతు ధర అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2023-04-29T23:44:39+05:30 IST