Kishan Reddy: కవితకు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

ABN , First Publish Date - 2023-03-09T19:04:17+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy: కవితకు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) పై బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మద్యం వ్యాపారం చేయకపోతే ఎందుకు భూజాలు తడుముకుంటున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రూ. లక్షల విలువైన ఫోన్లను కవిత ఎందుకు ధ్వంసం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. లక్షల విలువైన ఫోన్లను మిగతవారంతా ఎందుకు ధ్వంసం చేయలేదని, కవిత మాత్రమే ఎందుకు ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి మోదీకి కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి తమరే ఇరుక్కున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi liquor scam)తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై అన్నా చెల్లెలు (KTR, Kavitha) ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని కేటీఆర్, కవితలను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్‌ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్‌ స్కామ్‌ చేయాలని చెప్పామా అంటూ కేటీఆర్, కవిత(KTR, Kavitha)లను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల ఫ్యామిలీకి లేదన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందా అని కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-03-09T20:02:38+05:30 IST