కుటుంబం నిర్బంధం

ABN , First Publish Date - 2023-01-14T00:07:49+05:30 IST

: రాత్రికి రాత్రే ఇంటి చుట్టూ ప్రహరీని నిర్మించారు. ఆ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఆ ఇంటికి ఆఫ్‌లైన్‌ అనుమతి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇంటి పన్ను, నల్లా బిల్లులు అన్నీ చెల్లించినా, పంచాయతీ శాఖ అధికారులు తమను నిర్బంధించారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో జరిగింది.

కుటుంబం నిర్బంధం
లక్ష్మి ఇంటి గేటుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ

అక్రమ నిర్మాణమంటూ ఇంటి గేటుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం

అధికారులు ఆదేశాలిచ్చారని రాత్రికి రాత్రే ఏర్పాటు

ఇల్లు నిర్మాణ అనుమతులు ఆఫ్‌లైన్‌లో ఉండడమే కారణమని వెల్లడి

తాడిపర్తి గ్రామంలో ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్న ఓ మహిళ కుటుంబం

వనపర్తి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : రాత్రికి రాత్రే ఇంటి చుట్టూ ప్రహరీని నిర్మించారు. ఆ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఆ ఇంటికి ఆఫ్‌లైన్‌ అనుమతి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇంటి పన్ను, నల్లా బిల్లులు అన్నీ చెల్లించినా, పంచాయతీ శాఖ అధికారులు తమను నిర్బంధించారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపర్తి గ్రామంలో మూడేళ్ల క్రితం పత్తికొండ లక్ష్మి ఓ ఇంటిని నిర్మించుకున్నది. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పంచాయతీ రికార్డుల్లో పేరు నమోదు చేసుకొని, నిర్మాణం పూర్తిచేసింది. భర్త జనార్దన్‌రెడ్డి చనిపోయిన తర్వాత ఆ ఇంట్లోనే మూడేళ్లుగా ఉంటోంది. అయితే గత నెలలో గ్రామానికి చెందిన సందీప్‌ ఆ ఇంటి స్థలం విషయంలో వివాదం ఉన్నదని, అది తమకు చెందిన స్థలమని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి సమక్షంలో డీఎల్‌పీవో విచారణ పూర్తిచేసి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. గత నెల 31వ తేదీన డీఎల్‌పీవో నివేదిక ప్రకారం ఆ ఇంటి నిర్మాణం పంచాయతీ అనుమతి లేకుండా జరిగిందని, దాన్ని అక్రమ నిర్మాణంగా తేల్చారు. తర్వాత ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా పంచాయతీ అనుమతి కచ్చితంగా తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సందీప్‌ తరఫున వారు గురువారం రాత్రి ఆ ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాకుండా గేటుకు అడ్డంగా ఎత్తుగా గోడను నిర్మించారు. దీంతో లక్ష్మి కుటుంబం మొత్తాన్ని ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసినట్లయ్యింది. ఇంటి గోడ ద్వారా నిచ్చెన సహాయంతో బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష్మి ఇంటి నెంబర్‌ 2-34/1 కాగా, ఆ పక్కనే ఉన్న 2-35 నెంబర్‌ కలిగిన ఇంటికి ఎక్స్‌టెన్షన్‌ కోసం పంచాయతీ కార్యదర్శి ఈ నెల 10వ తేదీన అనుమతి ఇచ్చారు. కానీ, సదరు ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఏకంగా లక్ష్మి ఇంటి గేటుకు ఆనుకొని రాత్రికి రాత్రే గోడను నిర్మించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌ పంచాయితీ

సాధారణంగా గ్రామాల్లో గతంలో మొత్తం ఆఫ్‌లైన్‌ ద్వారానే అనుమతులు ఇచ్చేవారు. ఇటీవలి కాలంలో టీఎస్‌ బీపాస్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. అది కూడా మొత్తం ఇంటి ప్లాన్‌కు అనుగుణంగా అనుమతి ఇస్తున్నారు. బాధితులు, సర్పంచు ఆరోపిస్తున్న దాని ప్రకారం ఇంటి నిర్మాణానికి ఎవరు అనుమతి తీసుకోవాల నుకున్నా పంచాయతీ పాలక వర్గం మెజారిటీ ఆమోదించిన తర్వాతే దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ పంచాయతీ పాలకవర్గంలో తీర్మానం లేదని పాలకవర్గం చెబుతోంది. అలాగే కేవలం ప్రహరీ గోడకు అనుమతినిచ్చే అధికారం పాలకవర్గానికి లేదని అంటోంది. ప్రస్తుతం తాడిపర్తి పంచాయతీలో వెయ్యికిపైగా ఇళ్లు ఉండగా అందులో 221 ఇళ్లకు పైగా ఇంకా ఆఫ్‌లైన్‌లోనే అనుమతులు ఉన్నాయి. వాటికి లేని సమస్య కేవలం ఒక్క మహిళ ఇంటికి మాత్రమే రావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని పంచాయతీల్లో ఇలా ఆఫ్‌లైన్‌లో అనుమతులు ఉన్న ఇళ్లు వేలల్లో ఉంటాయి. అయితే పత్తికొండ లక్ష్మి దాదాపు మూడేళ్లుగా ఇంటి పన్ను, నల్లా బిల్లు చెల్లిస్తూనే ఉన్నది. కేవలం ఆఫ్‌లైన్‌లో అనుమతి ఉన్నదనే సాకుచూపి అక్రమ నిర్మాణం చేపట్టడంలో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ భూమికి సంబంధించిన వివాదం ఉంటే అది రెవెన్యూ పరిధిలోకి వచ్చే అంశం. రెవెన్యూ పరిధిలో తేలకపోతే ఇరుపక్షాలు కోర్టుకు వెళ్లి ఓనర్‌షిప్‌ను నిర్ధారించుకోవాలని, ఇలా చేయడం సరికాదని గ్రామస్థులు అంటున్నారు.

అక్రమ నిర్మాణం అనడం సరికాదు

మా గ్రామంలో పత్తికొండ లక్ష్మి అన్ని అనుమతులతోనే ఇంటిని నిర్మించుకున్నారు. ఆఫ్‌లైన్‌లో అనుమతి ఉన్నదనే సాకుతో, వ్యక్తిగత కక్షతో ఆ ఇంటి చుట్టూ ప్రహరీని గురువారం రాత్రికి రాత్రే నిర్మించారు. పంచాయతీ సెక్రటరీ పాలకవర్గం అనుమతి లేకుండా ఏకపక్షంగా ప్రహరీ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఆయన అలా ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ ఇచ్చినా.. గోడను ఆమె ఇంటికి అడ్డంగా నిర్మించడానికి వీల్లేదు. ఈ విషయమై గ్రామస్థుల సహకారంతో న్యాయ పోరాటం చేస్తాం.

- గంధం రామకృష్ణ, ఉప సర్పంచు, తాడిపర్తి

అన్యాయం చేస్తున్నారు

నేను అన్ని అనుమతులతోనే తాడిపర్తి గ్రామంలో ఇంటిని నిర్మించుకున్నాను. ప్రతీ సంవత్సరం ఇంటిపన్ను, నల్లా బిల్లు చెల్లిస్తున్నాను. కానీ, గురువారం రాత్రి నా ఇంటి గేటుకు అడ్డంగా ఎత్తుగా ప్రహరీ నిర్మించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేశారు. భర్త చనిపోయి.. కూతురితో కుట్టుమిషన్‌ పని చేసుకుంటూ జీవిస్తున్న నాపై కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. నాకు అన్యాయం చేస్తున్నారు. గ్రామస్థులంతా మానవతా దృక్ఫథంతో నాకు అండగా నిలిచి ఆదుకోవాలి.

- పత్తికొండ లక్ష్మి, బాధితురాలు

Updated Date - 2023-01-14T00:07:50+05:30 IST