‘ధరణి’ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2023-02-18T00:07:40+05:30 IST
‘ధరణి’కి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అదేశించారు.
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
- అధికారులతో సమీక్షా సమావేశం
గద్వాల క్రైం, ఫిబ్రవరి 17 : ‘ధరణి’కి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అదేశించారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై విచారణ నిర్వహించి పరిష్కరించాలని సూచించారు. అలంపూర్, ధరూర్ మండలాల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. కల్యాణలక్ష్మికి సంబంధించి కులం, ఆదాయం, ఎస్ఎస్సీ సర్టిఫికెట్లతో మీసేవ కేంద్రాల ద్వారా చేసుకున్న దరఖాస్తులపై ఆర్ఐలతో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, ధ్రువపత్రాలు జారీ చేయాలని చెప్పారు. వయసు నిర్ధారణ కోసం దరఖాస్తుదారుల వివరాలను, గ్రామాల్లో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన పత్రాలను పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, ఆర్డీవో రాములు, అధికారులు పాల్గొన్నారు.
ఇళ్లపై పూర్తి సమాచారం అందించాలి
ప్రభుత్వ భూమిలో ఇంటి నెంబర్ లేకుండా, ప్రైవేట్ భూమిలో రిజిస్ర్టేషన్ కాకుండా నిర్మించిన ఇళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. జీవో నెంబర్ 58, 59 ప్రకారం చేయవలసిన క్రమబద్ధీకరణ, ఫార్మ్-1ఫై కలెక్టరేట్ సమావేశపు హాలులో ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటినెంబర్ ఇచ్చి, ఓనర్షిప్ లేని ఇళ్లు ఎన్ని ఉన్నాయో తెలిపాలన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూమి ఉంటే, అనుమతి ఉన్న, అనుమతి లేని ఇళ్లకు సంబంధించి మునిసిపల్ కమిషనర్లు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్ని ఇళ్లకు క్రమం తప్పకుండా ఇంటి పన్ను కడుతున్నారని ఆరా తీశారు. జనాభాను బట్టి పంచాయితీ సెక్రటరీల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నారు. దళితబంధు పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలని చెప్పారు. దళితబంధు యూనిట్లకు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. జీవో నెంబర్ 58, 59 ప్రకారం గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల వారీగా పెండింగ్లో ఉన్న ధరఖాస్తుల ధ్రువీకరణను పూర్తి చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తి కావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ పాల్గొన్నారు.
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
పునరావాస కేంద్రాల్లో పెండింగ్లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. ర్యాలంపాడు, నాగర్దొడ్డి, ఆలూరు, చిన్నోనిపల్లి పునరావాస కేంద్రాల్లో పనులపై జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెలలో అవార్డు అవుతుందని, సర్వే అయిన 30 రోజుల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు. కేంద్రాల్లో లే అవుట్ ప్రకారం పనులు చేయాలని, ర్యాలంపాడులో విద్యుత్కు సంబంధించిన పనులు ప్రారంభిం చాలన్నారు. డ్రైనేజీలు, నీటి సరఫరా, రోడ్లకు సంబంధంచిన పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. ర్యాలంపాడు గ్రామస్థులతో మాట్లాడి ఫార్మ్-సి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి అప్రూవల్ అయిన జాబితాను పంపించాలన్నారు. గ్రామస్ధులతో మాట్లాడి దేవాలయానికి సంబంధించి పనులను మొదలు పెట్టాలన్నారు. నాగర్దొడ్డిలో మంజూరైన పనులు మొదలు పెట్టాలని, మిషన్ భగీరథ ద్వారా 820 ఇళ్లకు నీరు సరఫరా అయ్యేలా చూడాలని చెప్పారు. చిన్నోనిపల్లి, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో జాప్యం జరగకుండా పూర్తి చేయించాలని ఇంజనీర్లను ఆదేశి ంచారు. సమావేశంలో ఆర్డీవో రాములు పాల్గొన్నారు.