కవితలతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటారు

ABN , First Publish Date - 2023-06-12T00:11:59+05:30 IST

కవులు, కవయిత్రులు తమ కవితలతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటారని సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో తెలంగాణ సాహిత్య దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు.

కవితలతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటారు
ఘన సన్మానం అందుకున్న కవులు

సంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్‌ మంజూశ్రీ

సంగారెడ్డి రూరల్‌, జూన్‌11: కవులు, కవయిత్రులు తమ కవితలతో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటారని సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్‌ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో తెలంగాణ సాహిత్య దినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల జీవితాల్లో వచ్చిన వెలుగులు, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తీరును, అమలవుతున్న సంక్షేమ పథకాలను, మారిన తెలంగాణ ముఖ చిత్రాన్ని కవులు తమ కవితలతో కళ్లకు కట్టినట్లు చూపించారని కొనియాడారు. తెలంగాణ పోరాట ఉద్యమంలో సాహితీకారుల పాత్ర అమోఘమైనదని, తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం కవులు, కవయిత్రులకు, కళాకారులకు, సాహితీవేత్తలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని పేర్కొన్నారు.

కవితలతో సమాజాన్ని జాగృతం చేస్తారు

కవులు తమ కవితలతో సమాజాన్ని జాగృతం చేస్తారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. వారి కవితలు, రచనలు, పాటల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చారని, తెలంగాణ ఉద్యమంలో కవులు కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పడిన తరువాత కూడా సమాజహితం కోసం రాష్ర్టాభివృద్ధికి కవుల కవితలు దారి చూపేలా ఉండాలని కోరారు. అనంతరం రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటంలో కవులు ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేశారని అన్నారు. అనంతరం 62 మంది కవులను శాలువా, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, రూ.1,116 నగదు ప్రోత్సాహంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీఆర్‌వో నగే్‌షగౌడ్‌, డీఈవో వెంకటేశ్వర్లు, డీఐవో గోవింద్‌రామ్‌, యువజన సంక్షేమ అధికారి రాంచందర్‌, డిసివో ప్రసాద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-12T00:11:59+05:30 IST