మల్లన్న రైల్వేస్టేషన్‌ కావాలి

ABN , First Publish Date - 2023-03-18T00:14:33+05:30 IST

కోరమీసాల మల్లన్న కొలువైన కొమురవెల్లి గ్రామం మీదుగానే కొత్తపల్లి-మనోహరాబాదు రైల్వేలైన్‌ నిర్మాణం జరుగుతున్నా స్థానికంగా రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఉసూరుమంటున్నారు.

మల్లన్న రైల్వేస్టేషన్‌ కావాలి
కొమురవెల్లి శివారులో రైల్వేట్రాక్‌

కొమురవెల్లి మీదుగా కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌

ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలోనే పట్టాలు

స్టేషన్ల జాబితాలో లేని కొమురవెల్లి

నేతలు హామీలిచ్చినా ఆచరణకు నోచుకోకపోవడంతో భక్తుల్లో ఆందోళన

చేర్యాల, మార్చి 17: కోరమీసాల మల్లన్న కొలువైన కొమురవెల్లి గ్రామం మీదుగానే కొత్తపల్లి-మనోహరాబాదు రైల్వేలైన్‌ నిర్మాణం జరుగుతున్నా స్థానికంగా రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఉసూరుమంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్‌ వద్ద నిర్మించిన రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్‌ పేరు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ భక్తులకు అవసరమైన మల్లన్న రైల్వేస్టేషన్‌ ఏర్పాటులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైల్వేశాఖ అధికారులు, ప్రజాప్రతినిధుల ముందుచూపులేమితో రైల్వేస్టేషన్ల జాబితాలో కొమురవెల్లికి చోటు కల్పించలేదు. కేవలం రైల్వేగేట్‌ ఏర్పాటుకే పరిమితమైంది.

గూడ్స్‌వ్యాగన్‌ ట్రయల్‌రన్‌ పూర్తి

రైల్వేలైన్‌ నిర్మాణ మొదటి దశలో గజ్వేల్‌, కొడకండ్ల వరకు పనులు పూర్తిచేసి గూడ్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండో దశలో కొడకండ్ల నుంచి దుద్దెడ వరకు పనులను చేపట్టగా ఈ ప్రాంతానికి నెలాఖరులోగా రైలు కూత వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల గూడ్స్‌వ్యాగన్‌తో ట్రయల్‌రన్‌ సైతం నిర్వహించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గతంలో వేసిన 13 మీటర్ల పట్టాల స్థానంలో 260 మీటర్ల ట్రాక్‌ ప్యానెళ్లను బిగిస్తున్నారు. కొద్దిరోజుల్లో రైలు పరుగెత్తనుండటంతో అందరి దృష్టి మల్లన్న రైల్వేస్టేషన్‌పై మళ్లింది.

ఏటా లక్షలాదిమంది భక్తుల తరలిరాక

కొమురవెల్లి క్షేత్రంలో ప్రతీఏటా మూడు నెలలపాటు బ్రహ్మోత్సవ జాతర కొనసాగుతుంది. ఈరోజుల్లో రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీ్‌సగఽఢ్‌ నుంచి మొక్కులను చెల్లించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లోనూ మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. కొమురవెల్లి గ్రామం సమీపం నుంచే రైల్వే ట్రాక్‌ వెళుతుండడంతో ఇక్కడ రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేస్తే భక్తులకు ప్రయాణ కష్టాలు తీరే అవకాశం ఉంది. అయితే జిల్లాలోనే మరో పుణ్యక్షేత్రమైన లక్ష్మీనృసింహస్వామి కొలువైన నాచగిరి సమీపంలోనే నాచారం వద్ద రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం ఉన్న వేములవాడలోనూ రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కానీ ఏటా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే కొమురవెల్లికి మాత్రం రైల్వేగేట్‌తోనే సరిపెట్టారు.

లకుడారానికి 12..దుద్దెడకు 18 కిలోమీటర్లు

మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 15 స్టేషన్లకు రూపకల్పన చేశారు. వాటిలో సిద్దిపేట జిల్లా పరిఽధిలోని నాచారం, ఐరనాగారం, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట (మిట్టపల్లి), గుర్రాలగొందితో పాటు చిన్నలింగాపూర్‌, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, వెదిర, కొత్తపల్లి ఉన్నాయి. కానీ కొమురవెల్లి శివారులోని రైల్వేలైన్‌కు మల్లన్న ఆలయం కేవలం 2.5కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ స్థానికంగా కాకుండా సమీపంలోని లకుడారం, దుద్దెడ వద్ద స్టేషన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కొమురవెల్లి నుంచి లకుడారం 12 కిలోమీటర్లు, కొడకండ్ల 15కిలోమీటర్లు, దుద్దెడ 18 కిలోమీటర్లు దూరం ఉంది. దీంతో రైౖలు ఎక్కాలంటే మల్లన్న భక్తులు, స్థానికులు 12 నుంచి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కొమురవెల్లి రైల్వేగేట్‌ సమీపంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వం చొరవ వహించి భూమిని కేటాయించి ఇతర సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే స్టేషన్‌ సాకారమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖులు హామీ ఇచ్చినా అంతే సంగతి!

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ప్రారంభించి గోదావరి జలాలను కొమురవెల్లి మల్లన్న ఆలయానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌కు రైల్వేస్టేషన్‌ విషయాన్ని స్థానికులు విన్నవించడంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు. గవర్నర్‌ తమిళిసై మల్లన్న ఆలయ సందర్శనార్ధం వచ్చి స్టేషన్‌ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం సంబంఽధిత అధికారులతో హైదరాబాద్‌లో చర్చించారు. ఇటీవల రాష్ట్ర ప్రణాళికాసంఘం అధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ రైల్వేశాఖ డీఆర్‌ఎంతో మాట్లాడి స్టేషన్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హామీఇచ్చారు. రైల్వేశాఖ జీఎం, ఇతర అధికారులను సంప్రదించారు. ఈవిషయమై కొన్నాళ్ల క్రితం కమర్షియల్‌ విభాగం అధికారులు స్థల పరిశీలన చేసి నివేదిక అందించారు. కానీ నేతల హామీలు అమలుకు నోచుకోవడం లేదు.

Updated Date - 2023-03-18T00:14:33+05:30 IST